న్యూఢిల్లీ, మార్చి 17: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు 5జీ స్పెక్ట్రంను కేటాయించలేమని పార్లమెంట్లో కేంద్రం ప్రకటించింది. అలాంటి ప్రతిపాదన లేదని సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే బుధవారం లోక్సభకు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగ సంస్థలు 5జీ సేవలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
ప్రభుత్వ రంగంలోని పలు సంస్థలను ప్రైవేటీకరిస్తున్నప్పటికీ బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటీకరించబోమని మంత్రి చెప్పారు. అలాగే సంస్థ 4జీ సేవల విస్తరణ పూర్తికావడానికి మరో 18-24 నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్ను, ఎంటీఎన్ఎల్ను విలీనం చేసేలా ఓ ప్యాకేజీని కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే.
నష్టాల్లో ఉన్న ప్రైవేట్ రంగ టెలికం సంస్థలకు ఆర్థిక చేయూతనిచ్చే ఉద్దేశం ఏమీ లేదని సంజయ్ ఈ సందర్భంగా తెలియజేశారు. స్పెక్ట్రం వినియోగ, లైసెన్స్ ఫీజులకు సంబంధించిన (ఏజీఆర్) బకాయిల విషయంలో టెల్కోలకు ఎలాంటి మినహాయింపును ఇవ్వలేమన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా టెలికం శాఖ, సంస్థలు నడుచుకోవాల్సిందేనన్నారు.