న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు కొత్తగా నోట్లను ముద్రించే ఆలోచేనేదీ లేదని కేంద్రం కుండబద్ధలు కొట్టింది. కరోనాతో తలెత్తిన సంక్షోభం నుంచి బయట పడటానికి నోట్లను ముద్రించే ఆలోచన ఉందా? అని సోమవారం లోక్సభలో సభ్యులు ప్రశ్నించారు.
దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జవాబు ఇచ్చారు. కొత్త నోట్లు ముద్రించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కరోనాను నియంత్రించడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చేందుకు, ఉపాధి అవకాశాలకు రక్షణ కల్పించడానికి కొత్త నోట్లు ముద్రించాలని కేంద్రానికి ఆర్థిక వేత్తలు ఇటీవల సూచించారు.
కరోనాతో తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి కొత్త నోట్లను ముద్రించడం కాదని ప్రభుత్వం భావిస్తున్నదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
కరోనా వల్ల గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతానికి కుదించుకుపోయిందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం ఆత్మ నిర్బర్ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.