న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సైట్లపై భారత ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానుంది. ఇవి అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి ఈ-కామర్స్ సైట్లు ఇక నుంచి ఫ్లాష్ సేల్స్ అంటూ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉండదు. ఇప్పటికే వినియోగదారుల రక్షణ చట్టానికి చేసిన సవరణలపై జులై 6లోగా వ్యాఖ్యలు/సలహాలు ఇవ్వాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. ఇండియాలో ఏడాది మొత్తం ఏదో ఒక సందర్భం పేరు చెప్పి భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రకటిస్తాయి ఈ సైట్లు. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఈ-కామర్స్ సైట్ల వల్ల నష్టపోతున్నామంటూ వినియోగదారులు, వ్యాపారులు, అసోసియేషన్ల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇండియాలో ఏ ఈ-కామర్స్ సైటు కూడా ఫ్లాష్ సేల్స్ నిర్వహించకూడదన్న ప్రతిపాదనను వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెరపైకి తెచ్చింది. ఈ ఫ్లాష్ సేల్స్ ఇటు కస్టమర్లకు, అటు ఈ-కామర్స్ సైట్లకు బాగానే లాభాలు తెచ్చిపెడుతున్నా.. చిన్న వ్యాపారులు మాత్రం నష్టపోతున్నారు.
ఇలాంటి ఫ్లాష్ సేల్స్తో వినియోగదారులకు ఉండే అవకాశాలను ఈ-కామర్స్ సైట్లు పరిమితం చేస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా సెర్చ్ ఫలితాలను తారుమారు చేసి కొందరే సెల్లర్లను ఈ-కామర్స్ సైట్లు ప్రమోట్ చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.