Flight Journey with Full Capacity | ఈ నెల 18 నుంచి.. అంటే వచ్చేవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడువనున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా.. వాటి కెపాసిటీని బట్టి పూర్తిస్థాయిలో ప్రయాణికులను తీసుకెళ్తాయని పౌర విమానయానశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల వరకు ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. అయితే, కోవిడ్ ప్రొటోకాల్స్, ఇతర ఆంక్షలు కొనసాగుతాయి.
కనీస, గరిష్ట ప్రయాణ చార్జీలపై పరిమితులు యధావిధిగా కొనసాగుతాయి. రెండు గంటల్లోపు సాగే విమాన సర్వీసుల్లో భోజనం వడ్డించరు. కరోనా ఆంక్షల నేపథ్యంలో క్యాటరింగ్ సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విమానాల్లో భోజన వసతుల కల్పనకు అనుమతించాలని దేశంలోకెల్లా అతిపెద్ద క్యాటరర్, టాటా సన్స్ అనుబంధ తాజ్ శాట్స్.. కేంద్రాన్ని కోరింది.
తాజ్ శాట్స్ సీఈవో మనీశ్ గుప్తా ఇటీవల స్పందిస్తూ.. హోం, సంస్థాగత ఫుడ్ డెలివరీలో విభిన్న సేవలు అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఫ్లైట్ క్యాటరింగ్ బిజినెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. 60 శాతం ప్రీ-కరోనా స్థాయికి పెరిగింది. గతేడాది ఇది కేవలం 21 శాతమే. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి దేశీయ విమాన యాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.