హైదరాబాద్, జూన్ 22: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,838 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చిన రూ.351 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 708 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,187 కోట్ల నుంచి రూ.6,848 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ సుమిత్ దేబ్ మాట్లాడుతూ..ఖనిజ, స్టీల్ రంగానికి గతేడాది స్వర్ణయుగం లాంటిదని, దీంతో అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది కూడా ఈ రెండు రంగాలు మరింత వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని చెప్పారు. గతేడాది మొత్తానికి రూ.15,370 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.