నారాయణపేట : కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో భార్యను అతికిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మున్సిపాలిటీ పరిధి చందాపూర్ గ్రామంలో తాగిన మైకంలో భార్యను భర్త హత్య చేశాడు. చందాపూర్ గ్రామానికి చెందిన రాములుకు 20 ఏండ్ల క్రితం సత్యమ్మతో వివాహమైంది. వీరికి ఆరుగురు సంతానం. కాగా, ఆదివారం రాత్రి వీరి మధ్య చిన్న గొడవ జరగడంతో నిద్రిస్తున్న భార్య సత్యమ్మను గొడ్డలితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
సోమవారం ఉదయం పొలం దగ్గర రాములు ఉండడంతో గ్రామానికి చెందిన యువకులు అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని సీఐ శంకర్, ఎస్ఐ రాములు తెలిపారు.