న్యూఢిల్లీ, ఆగస్టు 3: దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ రికార్డులతో హోరెత్తిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 873 పాయింట్లు పెరిగి 53,823 పాయింట్ల చరిత్రాత్మక గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. వరుసగా సోమ, మంగళవారాల్లో సెన్సెక్స్ 1,287 పాయింట్లు లాభపడింది. తొలిసారిగా 16,000 పాయింట్ల స్థాయిని దాటిన ఎన్ఎస్ఈ నిఫ్టీ అదేపనిగా పెరుగుతూ 16,130 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచి 246 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఇది రెండు రోజుల్లో 368 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటి కంటే అధికంగా టైటాన్ 3.9 శాతం పెరిగింది. హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐలు సైతం 2-3 శాతం మధ్య లాభపడ్డాయి. వీటిలో ఎస్బీఐ రికార్డు స్థాయి రూ.446 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, అంబూజా సిమెంట్, ఏసీసీలు కూడా చరిత్రాత్మక గరిష్ఠాన్ని అందుకున్నాయి.
మంగళవారంనాటి ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.2.30 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,40,04,664 కోట్లకు పెరిగింది. ఇది కూడా రికార్డే.