ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లలో కరోనా ప్రకంపనలు చెలరేగాయి. మదుపరులను మహమ్మారి భయాలు చుట్టుముట్టడంతో సోమవారం ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 1,707.94 పాయింట్లు లేదా 3.44 శాతం పతనమై 47,883.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,897.88 పాయింట్లు క్షీణించింది. ఈ ఏడాది సెన్సెక్స్కు ఇది రెండో భారీ నష్టం. ఫిబ్రవరి 26న 1,939.32 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పడిపోవడం ఇదే. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 524.05 పాయింట్లు లేదా 3.53 శాతం క్షీణించి 14,310.80 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 5.32 శాతం వరకు నష్టపోయాయి. నిజానికి ఉదయం ఆరంభంలోనే మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా దిగజారాయి. కాగా, సెన్సెక్స్ 30లో డాక్టర్ రెడ్డీస్ షేర్ మినహా మిగతా షేర్లన్నీ కుప్పకూలాయి. రెడ్డీస్ షేర్ విలువ 4.83 శాతం ఎగిసి రూ.4,989.20 వద్ద ముగిసింది.
15 నిమిషాల్లో 7 లక్షల కోట్లు ఫట్
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు మదుపరుల సంపదను పెద్ద ఎత్తున కరిగించేశాయి. ఈ ఒక్కరోజే బీఎస్ఈ సంస్థల మార్కెట్ విలువ రూ. 8,77,435.5 కోట్లు ఆవిరైంది. కేవలం 15 నిమిషాల్లోనే రూ.7 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లడం గమనార్హం. భీకర నష్టాలతో మార్కెట్లు మొదలు కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.2,00,85,806.37 కోట్లు.
9 నెలల కనిష్ఠానికి రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకూ మరింతగా పడిపోతున్నది. వరుసగా ఆరో రోజు సోమవారం కూడా మరో 32 పైసలు క్షీణించింది. దీంతో 9 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 75.05 వద్దకు చేరింది. అంతకుముందు ఐదు రోజుల్లో రూపాయి మారకం విలువ 161 పైసలు పతనమైన విషయం తెలిసిందే. దీంతో గడిచిన ఆరు రోజుల్లో 193 పైసలు కోల్పోయినైట్లెంది. దేశంలో లాక్డౌన్ పరిస్థితులు విస్తరిస్తుండటం మదుపరుల్లో డాలర్పట్ల ఆదరణను పెంచిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పతనానికి కారణాలు
దేశంలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు
క్రమేణా విస్తరిస్తున్న స్థానిక లాక్డౌన్లు
డాలర్తో పోల్చితే రూపాయి విలువ క్షీణత
మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ
ఆసియాలోని ప్రధాన మార్కెట్ల పతనం
ఇవీ కూడా చదవండి…
అచ్చంపేటను మరో సిద్దిపేటగా మారుస్తాం