హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ)/బోడుప్పల్/: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు హైదరాబాద్లో గురువారం ఉదయం మూడు చోట్ల సోదాలు నిర్వహించారు. విశాఖలో మూడేండ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారని తెలంగాణ హైకోర్టు న్యాయవాది చుక్క శిల్ప, దొంగరి దేవేంద్ర, దుబాషి స్వప్నలపై అభియోగాలు దాఖలయ్యాయి. విశాఖలో నమోదైన మిస్సింగ్ కేసు దర్యాప్తును తాజాగా ఎన్ఐఏకి అప్పగించారు.
దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం ఏకకాలంలో రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్లో సోదాలు చేసి అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. మిస్సింగ్ కేసుపై తదుపరి విచారణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. 2017 డిసెంబర్లో తన కూతురిని కిడ్నాప్ చేశారని విశాఖలోని పెదబయలు పోలీస్స్టేషన్లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ నివాసానికి వచ్చేవారని, ఈ క్రమంలోనే వైద్యం చేయించే పేరుతో దేవేంద్ర.. రాధను ఇంటి నుంచి తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయవాది శిల్పను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడంపై ఆమె భర్త బండి కిరణ్ స్పందించారు. హేమానగర్కాలనీలో హైకోర్టు న్యాయవాది చుక్క శిల్ప నివాసంలో సోదాల విషయంలో ఎన్ఐఏ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేదని, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారని చెప్పారు.
మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర వేస్తున్నారనే శిల్ప చైతన్య మహిళా సంఘం నుంచి బయటికి వచ్చారని గుర్తు చేశారు. ఆమెను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారని, గతంలోనూ అర్బన్ మావోయిస్టు అని శిల్పను 6 నెలలు జైలులో ఉంచారని అన్నారు. రాధ మిస్సింగ్ కేసుతో శిల్పకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
చేగుంట: మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడు దేవేందర్ ఇంట్లో గురువారం ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంటలో నివాసం ఉంటున్న దేవేందర్ ఇంటికి ఉదయం ఏడుగురు అధికారులు వచ్చి అతడి తండ్రికి సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫోన్లో తండ్రితో దేవేందర్ మాట్లాడినట్టు సమాచారం రావడంతో ఆ మేరకు అధికారులు సోదాలు చేసి ఉంటారని స్థానికులు తెలిపారు.
దుబాషి శంకర్ సొంత గ్రామం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి. మావోయిస్టు అగ్రనేత ఆర్కేతో వ్యక్తిగత సంబంధాలు ఉండటంతో శంకర్ కుమారుడు దేవేందర్ ఇంట్లో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు సోదాలు చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. గత నవంబర్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారని దేవేందర్ తెలిపారు.