విమానయానం విలవిల

- 2019-20లో విమాన ప్రయాణీకులు 20.5 కోట్లుండగా ఈసారి కరోనాతో సగానికిపైగా తగ్గిపోయారు
- 2020-21లో దేశీయ విమానయాన పరిశ్రమకు దాదాపు రూ.50,000 కోట్ల నష్టం
- బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లోకొత్త కరోనా కేసులతో మళ్లీ కలవరం
కరోనా వైరస్.. భారతీయ విమానయాన రంగానికి 2020ని ఓ చేదు జ్ఞాపకంగా మిగిల్చింది. ఈ మహమ్మారి ఉద్ధృతికి మునుపెన్నడూ లేనివిధంగా లాక్డౌన్ వచ్చిపడగా, ప్రపంచ దేశాలన్నీ ఇతర దేశాల నుంచి రాకపోకలను నిలిపివేశాయి. ఈ పరిణామం దేశీయ విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన రంగాన్ని కొవిడ్-19 కోలుకోలేని దెబ్బతీసింది. వైరస్ ధాటికి నెలల తరబడి దేశ, విదేశీ విమాన సర్వీసులు ఎక్కడికక్కడే ఆగిపోగా.. సంస్థలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆదాయం లేక ఆయా సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఉన్న ఉద్యోగులకూ జీతాల్ని ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నాయి. కరోనాకు ముందు ఆర్థికంగా బలంగా ఉన్న సంస్థలూ.. ఉద్యోగులకు వేతన కోతల్ని చేపట్టాయి.
ఎయిర్ ఇండియాకు సెగ
కరోనా సెగ ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకూ తగిలింది. ఈ ఏడాది ఐదుసార్లు ఎయిర్ ఇండియా కోసం బిడ్ల సమర్పణ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో దేశ, విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి ఆదరణ కరువే అయ్యింది. చివరకు విదేశీ భాగస్వామ్యంతో ఎయిర్ ఇండియా ఉద్యోగులే బిడ్ను దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే టాటా గ్రూప్ రంగంలోకి దిగడం కొంతలో కొంత మోదీ సర్కారుకు ఊరటగా మిగిలింది.
జెట్ ఎయిర్వేస్పై కొత్త ఆశలు
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి గతేడాది ఏప్రిల్లో మూతబడిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణపై ఈ ఏడాది చివర్లో కొత్త ఆశలు రేకెత్తాయి. వచ్చే ఏడాది వేసవిలో జెట్ విమాన సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ కొత్త యాజమాన్యం ప్రకటించింది. సంస్థపై దాదాపు రూ.10వేల కోట్ల రుణభారం ఉన్నది.
- మార్చి 23 నుంచి విమానాలు బంద్
- ఏప్రిల్లో ఉద్యోగులను జీతాల్లేని సెలవులపై పంపిన గోఎయిర్, విస్తారా
- ఎయిర్ ఇండియా 10%, స్పైస్జెట్ 10-35%, ఇండిగో 5-25% వేతన కోతలు
- సీనియర్ల జీతాల్లో 20% తగ్గించిన ఎయిర్ ఏషియా ఇండియా
- మే 25 నుంచి దేశీయ విమానాలు మొదలు
- జూలైలో 10% సిబ్బందిని తొలగించిన ఇండిగో
- ఏప్రిల్-సెప్టెంబర్లో ఇండిగోకు రూ. 4,078 కోట్లు, స్పైస్జెట్కు రూ.712 కోట్ల నష్టాలు
- ఇప్పటికీ 80 శాతమే నడుస్తున్న దేశీయ విమాన సర్వీసులు
- దేశంలో ఇంకా మొదలుకాని షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలు
- వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్న అంచనా