ఇస్లామాబాద్: బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ మృతికి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఎస్కేఎంటీహెచ్ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఆయన ఎంతో ఉదారంగా వ్యవహరించి, తన సమయాన్ని వెచ్చించి విరాళాలు సేకరించడంలో సాయం చేశారు. మొదటి 10 శాతం విరాళాలు సేకరించడం చాలా కష్టమైంది. ఆ సమయంలో పాకిస్థాన్, లండన్లలో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడంలో దిలీప్ కుమార్ సాయం చేశారు అని ఇమ్రాన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా నా తరానికి దిలీప్ కుమార్ అత్యంత గొప్ప, విలక్షణ నటుడు అని కూడా ఇమ్రాన్ మరో ట్వీట్లో ప్రశంసించారు. మరోవైపు పాకిస్థాన్లోని ఖైబర్ పక్తూంఖ్వా ప్రభుత్వం కూడా దిలీప్ మృతికి సంతాపం తెలిపింది. ఈ లెజెండరీ నటుడు 1922లో పుట్టింది ఈ ప్రావిన్స్లోనే. ఈ మధ్యే అక్కడి ప్రభుత్వం దిలీప్ కుమార్ ఇంటిని మ్యూజియంగా మలచింది.