హైదరాబాద్, ఏప్రిల్ 29: హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్ అంచనాలకుమించి రాణించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.297 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.110.15 కోట్ల లాభంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ ఫౌండర్, సీఈవో సత్యనారాయణ చావా తెలిపారు. సమీక్షకాలంలో సంస్థ రూ. 1,411.93 కోట్ల ఆదాయాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.839.14 కోట్లుగా ఉన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.4,814 కోట్ల ఆదాయంపై రూ.984 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మరోవైపు, సంస్థ ప్రతిషేరుకు 80 పైసలు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది.