ఆర్థికం కోలుకొంటున్నా, నిరుద్యోగులు పెరుగుతున్నారు
ఆర్థికాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఏర్పడుతున్నదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తంచేశారు. ‘ ఆర్థిక వ్యవస్థ కోలుకొంటున్నా, నిరుద్యోగం పెరుగుతోంది…ఈ రోజు నిరుద్యోగమనేది సమస్య కాదు..ఒక సంక్షోభం’ అని వ్యాఖ్యానించారు. గురువారంనాడిక్కడ పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీసీసీఐ వార్షిక సదస్సులో సుబ్బారావు మాట్లాడుతూ వ్యవస్థాగత రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని, కార్మికులు అధిక ఉత్పాదక రంగం నుంచి అవ్యవస్థీకృత రంగంలోకి వెళుతున్నారన్నారు. భారత ఆర్థికాభివృద్ధి రేటును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే వృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడాల్సి ఉందన్నారు. అధిక వృద్ధి సాధించడమే కాదు, పెరుగుతున్న అసమానతల్ని తగ్గించాలన్నారు.
కుటుంబాల ఆదాయాలు తగ్గుతున్నాయ్..
కుటుంబాల ఆదాయాలు తగ్గుతున్నాయని, భవిష్యత్ పట్ల కుటుంబాల్లో అనిశ్చితి నెలకొందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు. ప్రైవేటు వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతుల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలని, వృద్ధి కోసం దేశం కేవలం వినియోగం మీదే ఆధారపడితే కుదరదని అన్నారు. అందుచేత మనం ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులపై ఆధారపడాల్సిఉందని, అన్ని విభాగాలు జోరు ప్రదర్శించాల్సి ఉందన్నారు.
పెద్ద కార్పొరేట్లకు చిన్న కంపెనీలు బలి…
ఒకవైపు సమాజంలో అసమానతలు పెరుగుతుంటే, కార్పొరేట్ల లాభాలు కూడా పెరుగుతున్నాయని సుబ్బారావు చెప్పారు. చిన్న కంపెనీల మార్కెట్ వాటాను పెద్ద కార్పొరేట్లు చేజిక్కించుకొంటున్నాయని, పెరుగుతున్న అసమానతలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రభుత్వం అత్యవసరంగా వ్యయాల్ని పెంచాల్సిన ఉందని సూచించారు.