న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు లేదా 40 గంటల వ్యవస్థను అమలు చేసే ఆలోచన లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన లోక్సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర వేతన కమిషన్ల సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని దినాలు/సెలవు/పని గంటలపై నిర్ణయం తీసుకుంటారు. నాలుగో వేతన సవరణ సంఘం సిఫారసు మేరకు వారానికి ఐదు రోజులు, ఎనిమిదిన్నర గంటల పనిని అమలు చేశాం అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఏడో వేతన సవరణ సంఘం ఇదే పద్ధతిని కొనసాగించవచ్చని సిఫారసు చేసినట్లు ఆయన చెప్పారు.