సియోల్, జూన్ 21: అరటి పండ్లు ఒక్క కిలోకు 3,300 రూపాయలు. కాఫీ పొడి ప్యాకెట్ 7,500 రూపాయలు. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభానికి, మండిపోతున్న ధరలకు ఈ రేట్లే తార్కాణాలు. ఉత్తర కొరియాలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి ఆకాశాన్నంటాయి. ధరల పెరుగుదలపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆహార ఉత్పత్తి ప్రణాళికలు విఫలం అయ్యాయని స్వయంగా అంగీకరించారు. గతేడాది సంభవించిన తుఫాను, కరోనా కారణంగా నార్త్ కొరియాలో ఆహార ఉత్పత్తి దెబ్బతిన్నది. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు.
ఆహార సంక్షోభం కొత్తేమీ కాదు
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం కొత్తేమీ కాదు. ఉత్తర కొరియా తమ ఆహార అవసరాలకు ఎక్కువగా చైనాపై ఆధారపడుతుంది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉత్తర కొరియాలో 8.60 లక్షల టన్నుల ఆహార కొరత ఉంది. ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న 40 దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఈ పరిస్థితిని కరోనా, తుఫాన్లు తీవ్రం చేశాయి. కరోనా కారణంగా దిగుమతులు నిలిచిపోయాయి. అదే సమయంలో తుఫానుతో స్వదేశంలో పంటలు బాగా దెబ్బతిన్నాయి.