హైదరాబాద్, ఏప్రిల్ 8: గత ఆర్థిక సంవత్సరం (2020-21) తెలంగాణకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) రూ.20,549 కోట్లను అందించింది. రాష్ట్రంలోని రైతులకు పంట రుణాలు, టర్మ్ రుణాల కోసం బ్యాంకులకు రూ.13,915 కోట్లను ఇచ్చినట్లు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ వైకే రావు తెలిపారు. అయితే ఇందులో రూ.100 కోట్లను నాబార్డు వాటర్షెడ్ ప్రాజెక్టు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక రూ.6,633 కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ర్టానికి అందించినట్లు రావు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.16,312.50 కోట్లనే ఇచ్చారు. కాగా, ఇప్పటికే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్కు రూ.4,600 కోట్లకుపైగా నిధులను నాబార్డు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో గత ఆర్థిక సంవత్సరం రూ.2,394.70 కోట్లను విడుదల చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్కు ధాన్యం సేకరణ కోసం రూ.2,500 కోట్ల రుణసాయం కల్పించింది.