నర్సంపేట/పరకాల/నర్సంపేట రూరల్/దుగ్గొండి/చెన్నారావుపేట/ఖానాపురం, మే 14: పట్టణంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే స్వల్ప సంఖ్యలో మసీదులకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చాలా కుటుంబాలు ఇండ్లలోనే వేడుకలు చేసుకున్నాయి. మతపెద్దలు మసీదులకు వెళ్లారు. పరకాల పట్టణంలో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముస్లింలు ఇంటి వద్దే ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో అలయ్ బలయ్ ఇవ్వకుండా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ పలు ముస్లిం కుటుంబాలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నర్సంపేట మండలంలోని గ్రామాల్లో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు వస్తువులు, దుస్తులు, డబ్బు రూపంలో దానధర్మాలు చేశారు. గురిజాలలో సర్పంచ్ గొడిశాల మమత పేద ముస్లింలకు గిఫ్ట్ప్యాక్లు అందించారు. దుగ్గొండి మండలంలో ముస్లింలు చిన్నాపెద్ద తేడాలేకుండా శుక్రవారం ఉదయాన్నే స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేశారు. రేబల్లె, దుగ్గొండి, పొనకల్, మందపల్లి, తిమ్మంపేటలోని మసీదుల్లో ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చెన్నారావుపేట మండలంలో లాక్డౌన్ వల్ల సామూహిక ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లకుండా కుటుంబ సమేతంగా ఇండ్లలోనే ప్రార్థనలు చేశారు. మహ్మద్ ముస్లిం మజీద్ మండల అధ్యక్షుడు మహ్మద్ అయ్యూం మాట్లాడుతూ అల్లా దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలుగాలని ఆకాంక్షించారు. ఖానాపురం మండలవ్యాప్తంగా ముస్లింలు కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. పలువురు ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సలీం పాషా, అజహర్, సమీ ఉల్లాహ్, అనాస్, రేహన్ పాల్గొన్నారు.
ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు
నల్లబెల్లి/ఆత్మకూరు/దామెర/వర్ధన్నపేట: ముస్లింలు ఇండ్లలోనే నమాజ్ చేసి కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేడపల్లి, నల్లబెల్లి, మూడుచెక్కలపల్లె, నారక్కపేటలో మతగురువులు కరోనా నుంచి ప్రజలను కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆత్మకూరు మండలంలోని గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలను నిరాడంబరంగా ఇళ్లలోనే నిర్వహించుకున్నారు. ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ను ఇళ్లలోనే జరుపుకున్నారు. దామెర మండలంలోని ముస్లింలు ఇండ్లలోనే నమాజ్ చేశారు. ఊరుగొండ, ల్యాదెళ్ల, పులుకుర్తి, కోగిల్వాయిలో జరిగిన రంజాన్ వేడుకల్లో వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, మండల కోఆప్షన్ సభ్యుడు అక్తర్, మతపెద్దలు అన్వర్పాషా, హుసునొద్దీన్, హబీబొద్దీన్, నజీమొద్దీన్, ముబీనొద్దీన్ పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలంలో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మ న్ మార్నేని రవీందర్, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
అలయ్ బలయ్కి బదులు సలామ్
శాయంపేట/నడికూడ/సంగెం/గీసుగొండ/పర్వతగిరి: మండలంలో రంజాన్ వేడుకలను ముస్లింలు నిరాడంబరంగా జరుపుకున్నారు. మాస్కులు ధరించి ప్రార్థనలు చేశారు. ఎక్కువ సంఖ్యలో ఇండ్లల్లోనే ప్రార్థనలు చేశారు. గంగిరేణిగూడెంలోని మసీదు బయట కాట్రపల్లి, వసంతాపూర్, నిజాంపల్లిలోని ముస్లింలు ప్రార్థనలు చేశారు. ముస్లింలు అలయ్ బలయ్కి బదులు సలామ్తో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాయకులు మహ్మద్ పాషా, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రాజ్మహ్మద్, సర్వర్ పాల్గొన్నారు. కాగా, శాయంపేట సీఐ తోగిటి రమేశ్కుమార్ పర్యవేక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో మసీదుల్లోకి కొందరికే అనుమతిచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్సై ప్రవీణ్కుమార్ ఉన్నారు. నడికూడ మండలంలో ముస్లింలు ఇంటి వద్దే ప్రార్థనలు చేశారు. సంగెం మండలంలో ముస్లింలు నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. గీసుగొండ మండలంలో ముస్లింలు మసీదులకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకున్నారు. పర్వతగిరి మండలవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
పరస్పర శుభాకాంక్షలు
రాయపర్తి: మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలను ప్రత్యేక జాగ్రత్తలతో జరుపుకున్నారు. ఇండ్లలోనే ఈద్ నమాజ్లు జరుపుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలకేంద్రంలోని మజీద్-ఏ-నూర్ సదర్సాహెబ్ మహ్మద్ లాయఖ్ అలీ నేతృత్వంలో ముస్లిం కాలనీల్లో ఈద్ నమాజ్లు జరుపుకోగా, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, రాయపర్తి పీఏసీఎస్ మాజీ చైర్మన్ బిల్లా సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ ముస్లింలను కలిసి ఈద్ముబారక్ తెలియజేశారు. రాయపర్తి, కొత్తరాయపర్తి, మహబూబ్నగర్, బందన్పల్లి, కొత్తూరు, పెర్కవేడు, కొండాపురం, ఊకల్, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జగన్నాథపల్లి, మైలారం, కాట్రపల్లి, కొండూరు, గన్నారం, తిర్మలాయపల్లిలో ముస్లింలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.