Mukesh Ambani Shocked | దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి శుక్రవారం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్లో 340 కోట్ల డాలర్ల (రూ.24,713 కోట్లు) విలువైన ఫ్యూచర్ రిటైల్ విలీన ఒప్పందానికి వ్యతిరేకంగా, అమెజాన్కు అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఫ్యూచర్ ఆస్తుల కొనుగోలుపై ముందుకు వెళ్లొద్దని రిలయన్స్కు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు వ్యతిరేకంగా రావడంతోపాటు రిలయన్స్, దాంతో జట్టు కట్టిన ఫ్యూచర్ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ప్రత్యేకించి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.3 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో రిలయన్స్ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఇంట్రాడేలో గరిష్ఠ రికార్డులను కోల్పోయాయి. ఫలితంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.77 లక్షల కోట్ల నుంచి రూ.13.47 లక్షల కోట్లకు పడిపోయింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 215 పాయింట్ల పతనంతో 54,277.72 పాయింట్ల వద్ద నిలిచింది. అంతకుముందు అంతర్గత ట్రేడింగ్లో 355 పాయింట్ల వరకు నష్టపోయింది.
ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 16,250 పాయింట్ల దిగువకు పడిపోయింది. వొడాఫోన్ ఐడియా షేర్లు 20 శాతం పుంజుకున్నాయి. బీఎస్ఈలోని 30 ఇండెక్స్ల్లో 17 నష్టాల బాటలోనే పయనించాయి. రిలయన్స్ రెండు శాతం, ఆల్ట్రాటెక్ సిమెంట్ 1.40 శాతం, టాటా స్టీల్ 1.27 శాతం నష్టపోయాయి.