చేర్యాల, జూలై 10 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి గ్రామ పంచాయతీ శివారు పల్లెగా ఉన్న శభాష్గూడెం అభివృద్ధిలో పయనిస్తున్నది. ప్రభుత్వం నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రగతిలో శభాష్ గూడెం అనిపించుకుంటున్నది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్న పనులతో ఇటు అభివృద్ధితో పాటు ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం గ్రామానికి ప్రతినెలా నిధులు విడుదల చేయడంతో వైకుంఠథామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డుతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రత్యేకంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్తో పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ సేకరిస్తున్నారు. దీంతో వీధులు, గ్రామ పరిసరాలు శుభ్రంగా కనిపిస్తున్నా యి. వాటర్ ట్యాంకర్ ద్వారా హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. గ్రామంలో గల్లీగల్లీకి సీసీ రోడ్లు వేశారు. సీసీరోడ్లు వేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠధామం, డంపింగ్యార్డుతో గ్రామస్తులకు ఎంతో వసతి చేకూరింది. గత పల్లెప్రగతిలో గ్రామంలోని 14 పాత ఇండ్లను కూల్చివేశారు. విద్యుత్ స్తంభాలకు దీపా లు ఏర్పాటు చేశారు. రోజువారీగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు సర్పంచ్, కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గ్రామంతోపాటు పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో సైతం మొక్కలు నాటడడంతో పాటు వాటిని సంరక్షిస్తున్నారు.
ప్రకృతివనంతో కొత్తందం
పల్లెప్రకతి వనం ఊరికే కొత్తందం తెచ్చింది. సర్పంచ్ బొడ్డు స్వప్నకిరణ్, కార్యదర్శి రాజు, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు. ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్, పలురకాల పూలు, పండ్ల మొక్కలు నాటారు.
ప్రత్యేక ఆకర్షణగా
ఇరువైపులా చెట్లు
హరితహారంలో నాటి మొక్క లు ఏపుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పాఠశాల ఆవరణ, ప్రధాన కూడళ్లతో పాటు గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. బాటసారులతో పాటు అటువైపుగా వెళ్తున్న వారికి ఇంపుగా కనిపిస్తున్నాయి. పాఠశాలకు పల్లెప్రగతి నిధులతో రంగులు సైతం వేయడంతో అందగా కనిపిస్తున్నది.
మరింత అభివృద్ధి
చేసుకుంటాం
ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గతంలో అనేక సమ్యలు ఉండేవి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లెప్రగతితో ఊరికి అన్ని సౌకర్యాలు వచ్చాయి. గ్రామంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సీసీ రోడ్లు నిర్మించడంతో గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం.
బొడ్డు స్వప్నకిరణ్,
శభాష్గూడెం, సర్పంచ్
గ్రామాభివృద్ధికి సహకారం
పల్లెప్రగతిలో గ్రామంలో అభివృద్ధి జరుగుతున్నది. గ్రామ అభివృద్ధికి సర్పంచ్, పాలకవర్గానికి సహకారం అందిస్తున్నాం. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ‘పల్లెప్రగతి’ గ్రామాలకు వరం. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
-వుల్లంపల్లి కరుణాకర్
ఎంపీపీ, చేర్యాల
అందరి సహకారంతో..
పల్లెప్రగతి పనులతో గ్రామం శుభ్రంగా తయారవుతున్నది. ప్రతిరోజూ పంచాయతీ సిబ్బందితో వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నాం. పల్లెప్రకృతి వనంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. సర్పంచ్, ఎంపీపీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం.
-ఏలూరి రాజు, పంచాయతీ కార్యదర్శి, శభాష్గూడెం