బెంగళూరు: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొన్ని రంగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించాయి. అందులో ఐటీ, అనుబంధ రంగాలు ముందున్నట్లు తాజాగా నౌక్రీ జాబ్స్పీక్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రంగాల్లో ఉద్యోగాలు ఆల్టైమ్ హైకి చేరినట్లు తెలిపింది. ఇండియాలో హైరింగ్ ట్రెండ్స్ జూన్ నెలలో 2047 నుంచి 2359కి చేరి 15 శాతం వృద్ధి సాధించినట్లు ఈ రిపోర్ట్ చెప్పింది. దేశంలో హైరింగ్ ట్రెండ్స్ను సూచించే టాప్ ఇండెక్స్ ఇదే.
టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో ఐటీ-సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పెరిగాయి. జూన్ నెలలో ఐటీ ఉద్యోగాల్లో 5 శాతం వృద్ధి కనిపించింది. కొవిడ్కు ముందు 2019 జూన్తో పోలిస్తే.. ఇప్పుడు ఐటీ రంగం ఆల్టైమ్ హై అయిన 52 శాతం వృద్ధి సాధించినట్లు నౌక్రీ జాబ్స్పీక్ వెల్లడించింది. కొవిడ్ వల్ల దేశంలో డిజిటైజేషన్ పెరగడం వల్ల టెక్ కంపెనీల్లో నియామకాలు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది.
మే నెలతో పోలిస్తే జూన్లో అటు పర్యాటక (87 శాతం), రిటెయిల్ (57 శాతం) రంగాల్లోనూ నియామకాల్లో మంచి వృద్ధి కనిపిస్తోన్నట్లు నౌక్రీ నివేదిక చెప్పింది. కరోనా ఆంక్షలు ఎత్తేయడం ఈ రంగాలకు కలిసి వచ్చింది. ఇక ఇన్సూరెన్స్ (38 శాతం), బ్యాంకింగ్/ఆర్థిక రంగ సేవలు (29 శాతం), ఫార్మా/బయోటెక్ (22 శాతం) రంగాలు కూడా కోలుకున్నాయి.
ఉద్యోగాల మార్కెట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోలుకున్నట్లు కూడా తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది. మే నెలలో మైనస్లో ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు రెండంకెలకు చేరడం విశేషం. హైదరాబాద్ (10 శాతం)తోపాటు పుణె (10 శాతం), బెంగళూరు (4 శాతం)లలో హైరింగ్ ట్రెండ్ వృద్ధి సాధించినట్లు నౌక్రీ తెలిపింది.