న్యూఢిల్లీ, ఆగస్టు 12: స్వల్ప విరామం తర్వాత గురువారం స్టాక్ మార్కెట్ మరో కొత్త రికార్డు స్థాయిని చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 55,000 శిఖరానికి చేరువైంది. ఇంట్రాడేలో 54,874 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్ఠస్థాయిని తాకి, చివరకు 318 పాయింట్ల లాభంతో 54,844 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు ర్యాలీ జరిపి 16,364 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా పవర్గ్రిడ్ 6.22 శాతం పెరిగింది. టెక్మహింద్రా, హెచ్సీఎల్ టెక్, టైటాన్, లార్సన్ అండ్ టూబ్రో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ లాభాల్లో ఉన్నాయి. ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉంటుందన్న విశ్వాసంతో ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను జోరుగా కొన్నారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.