జోరుగా పీడీఎస్ బియ్యం దందా
రాయిచూర్, ఏపీ, మహారాష్ట్రకు అధికంగా రవాణా
అక్రమార్కులకు అధికారుల అండదండలు
పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న వైనం
గద్వాల న్యూటౌన్, మార్చి 30 :రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నది. నెలనెలా వందల క్వింటాళ్ల కొద్దీ పక్కదారి పడుతున్నది.అక్రమార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు పీడీఎస్ బియ్యం దందా కొనసాగిస్తున్నారు. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్న చందంగా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, ధరూర్, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో జోరుగా కొనసాగుతున్నది. రాత్రి వేళల్లో కర్ణాటకలోని రాయిచూర్, మహారాష్ట్ర, ఏపీకి అధికంగా తరలిస్తున్నారు. అయితే అక్రమార్కులకు అధికారుల అండదండలు తోడవడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. అక్కడక్కడ పోలీసులు తనిఖీల్లో పట్టుబడుతున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
అక్రమార్జనే ధ్యేయంగా కొందరు పీడీఎస్ బియ్యాన్ని రాష్ర్టాలు దాటిస్తున్నారు. దొరికితే దొంగలు దొరకకపోతే దొరలు అన్న చందంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతున్నది. అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. నిరుపేదలు రెండు పూటలా కడుపునిండా తినాలనే లక్ష్యంతో ప్రభు త్వం కిలో బియ్యం రూపాయికే అందించే ఆహార భద్రత పథకం అధికారుల నిర్లక్ష్యంతో అబాసుపాలవుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వైఫల్యం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు చౌకధర దుకాణాల డీలర్లు లబ్ధ్దిదారుల నుంచి నేరుగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని లబ్ధ్ధ్దిదారులు పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. దీంతో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పీడీఎస్ బియ్యంతో అక్రమ దందా చేస్తున్నారు. ఈ దందా కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, ధరూర్, గద్వాల, ఇటిక్యాల, అయిజ తదితర మండలాల్లో జోరుగా కొనసాగుతున్నది. వ్యాపారులు, లబ్ధిదారులను టార్గెట్ చేసుకొని కిలో బియ్యం రూ.8 నుంచి 10వరకు కొనుగోలు చేస్తున్నారు. లబ్ధ్దిదారులు చాలా మంది ఈ బియ్యాన్ని వండుకునేందుకు ఇష్టపడక విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో బియ్యం వ్యాపారులు డీలర్ల నుంచే నేరుగా ప్రతి నెలా వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో రెండు నెలలుగా గట్టు, కేటీదొడ్డి, ధరూర్, అయిజ, మల్దకల్ తదితర మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పట్టుబడ్డాయి.
దందా సాగుతుందిలా..
రేషన్ బియ్యాన్ని డీలర్లు కొనుగోలు చేసే ముందు.. లబ్ధ్దిదారులతో కందిపప్పు, గోధుమపిండి, చక్కెర, వంటనూనె, తీసుకునేలా ఒప్పందం చేసుకుంటారు. వాస్తవానికి చౌకధర దుకాణాల నుంచి సబ్సిడీ బియ్యాన్ని మాత్రమే లబ్ధ్దిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొందరు డీలర్లకు కిరాణా వ్యాపారం ఉండటంతో నాసిరకం వంట సరుకులను లబ్ధ్దిదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి కిలో రూ. 45 నుంచి రూ.50 వరకు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. బాధ్యులపై చర్య తీసుకోవాల్సిన రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సైప్లె అధికారులు, సిబ్బందిలో కొంతమంది నెలవారీగా మామూళ్లు తీసుకొని అటువైపు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాత్రివేళ రేషన్ బియ్యం గూడ్స్ వాహనాల్లో కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్కు తరలిస్తున్నారు. కాగా, గోన్పాడు, కేటీదొడ్డి, గద్వాల, గట్టు, మల్దకల్, అయిజ శివారు ప్రాంతాల్లో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించా రు. ఈ మేరకు రెండు నెలలుగా పెద్ద ఎత్తున బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసి సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సైప్లె అధికారులకు అప్పగించారు.
ఇతర ప్రాంతాలకు తరలింపు..
ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న బియ్యాన్ని వ్యాపారులు పెట్టుబడి లేకుండా తక్కువ మొత్తానికి కొనుగోలు చేసి.. ఎక్కువ డబ్బుకు ఇతర జిల్లాలు, రాష్ర్టాల్లో విక్రయించి రూ.కోట్లు అర్జిస్తున్నారు. రాయిచూర్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలించి.. రీసైక్లింగ్ చేసి మళ్లీ సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో రూ.45 నుంచి రూ.50 ధరకు విక్రయిస్తున్నారు. అయితే, వ్యాపారులకు అధికారులతో సంబంధాలు ఉండడంతో బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రేషన్ బియ్యాన్ని అధిక శాతం కర్ణాటకకు తరలిస్తున్నారు. కేటీదొడ్డి పోలీసుల తనిఖీ ల్లో క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యం పోలీసులకు పట్టుబడుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శ నం. కొత్త పంథాలో బియ్యాన్ని తరలిస్తున్నా రు. కేటీదొడ్డి పోలీసులకు ఈ నెల 1వ తేదీన సర్కస్ బండిలో తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేష న్ బియ్యం పట్టుబడ్డాయి. ఇలా జిల్లా వ్యా ప్తం గా లబ్ధిదారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొను గోలు చేసేందుకు ముఠాగా మారారు. బియ్యం పట్టుబడిన క్రమంలో నాయకులు, అధికారులు రంగప్రవేశం చేసి ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో సామాన్య వ్యక్తులపై కేసులు నమోదు చేయడం కొసమెరుపు.
పట్టుబడిన సంఘటనలు..
డిసెంబర్ 31న గట్టు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల్లో 15 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.
జనవరి 19న మల్దకల్ మండలంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
జనవరి 18న అక్రమంగా రాయిచూర్కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గోన్పాడు శివారులో 34.10 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
జనవరి 23న అయిజ నుంచి రాయిచూర్కు మూడు బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 63 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 9న కేటీదొడ్డిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 11న నందిన్నె వద్ద 30 క్వింటాళ్ల రేషన్ బియ్యన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 26న గట్టులో రాయిచూర్కు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
మార్చి 1న రెండు వాహనాల్లో అక్రమంగా రాయిచూర్కు తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
రేషన్ బియ్యం తరలిస్తే సహించేది లేదు..
అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచాం. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పదే పదే పట్టుబడిన వారిపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తాం. లబ్దిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగొలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు.
ఇవి కూడా చుడండి
కొవిడ్ నిబంధనల పాటింపుపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
గిరిజన విద్యార్థిని గ్రామంలోకి తిరిగి ప్రవేశం
మల్లన్న’ హుండీ లెక్కింపు..రూ.43,47,983 ఆదాయం