న్యూఢిల్లీ : మహమ్మారి బారినుంచి ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా కోలుకుంటుండటంతో ఇప్పటివరకూ మందగించిన ఉపాధి అవకాశాలు ఊపందుకుంటున్నాయి. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో భారత కార్పొరేట్లు నూతన నియామకాలపై దృష్టిసారించడంతో కొత్త కొలువులు పెద్దసంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి.
21 రంగాల్లోని 700 చిన్న మధ్యతరహా భారీ కంపెనీలను పలుకరించి వివరాలు రాబట్టిన తాజా సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఓ వాణిజ్య పత్రిక చేపట్టిన ఈ సర్వేలో జూన్-సెప్టెంబర్ క్వార్టర్లో అధికంగా నియామకాలు చేపడతామని 38 శాతం కంపెనీలు తెలిపాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రంగాల్లో నియామకాల విషయంలో రికవరీ చోటుచేసుకుందని టీమ్లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో హైరింగ్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు కంపెనీలు సన్నద్ధమవుతున్నాయని చెప్పారు.
లాక్డౌన్ నియంత్రణలు ఎత్తివేయడం, వినిమయ డిమాండ్ పెరగడం, ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో బ్లూకాలర్, వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ హైరింగ్కు ఊతమిస్తోందని అన్నారు. జాబ్ మార్కెట్ గణనీయంగా కోలుకునే దిశగా సాగుతోందని దాల్మియా సిమెంట్ ఎండీ మహేంద్ర సింఘి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేపడుతుండటం కూడా సానుకూల పరిణామమని చెప్పారు.