హైదరాబాద్: డ్రోన్ల నిర్వహణకు అనుసరించాల్సిన నియమ నిబంధనలు, నియంత్రణ చర్యలపై అభిప్రాయాలు తెలుపాలని ప్రజలను కేంద్ర పౌర విమానయానశాఖ కోరింది. ఈ మేరకు డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్-2021ని గురువారం విడుదల చేసింది. ఆగస్టు ఐదో తేదీ లోగా వాటాదారులంతా తమ అభిప్రాయాలను తెలుపాలని అభ్యర్థించింది. ఇంతకుముందు మార్చి 12న విడుదల చేసిన యూఏఎస్ రూల్స్ స్థానంలో తాజాగా వెల్లడించిన ముసాయిదా నిబంధనలను అమలులోకి తీసుకొస్తారు.
డ్రోన్ల తయారీ, నిర్వహణ, బదిలీ, లీజింగ్, ట్రేడింగ్, ఎగుమతులు-దిగుమతి దారులు తమ అభిప్రాయాలను తెలుపాలని పౌర విమానయానశాఖ కోరింది. ఆర్థిక వృద్ధిరేటుపు ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఉపాధి అవకాశాల కల్పనలో డ్రోన్లకు అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.
ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు, వారి భద్రతకు ముప్పు వాటిల్లకుండా డ్రోన్ల నిర్వహణను నియంత్రించాల్సిన అవసరం ఉంది.
డ్రోన్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం డ్రోన్ డ్రాఫ్ట్ రూల్స్ను సరళతరం చేయాల్సి ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ పేర్కొన్నారు.
ప్రతిపాదిత డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా బిజినెస్ ఫ్రెండ్లీ నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తుందని ప్రేమ్ కుమార్ విస్లావత్ అన్నారు.
డ్రోన్ల వినియోగాన్ని విస్తరించే లక్ష్యంతో 2021 యూఏఎస్ రూల్స్ స్థానంలో తాజా డ్రోన్స్ నిర్వహణ డ్రాఫ్ట్ రూల్స్ అమలులోకి వస్తాయి.
డ్రోన్ల నిర్వహణకు అవసరమైన ధ్రువీకరణలను తగ్గించడం తాజా రూల్స్ ఉద్దేశం. ప్రత్యేక ధ్రువీకృత నంబర్, ప్రత్యేక ప్రొటోటైఫ్ గుర్తింపు నంబర్, ధ్రువీకరణ సర్టిఫికెట్, నిర్వహణ సర్టిఫికెట్, ఇంపోర్ట్ క్లియరెన్స్, ఉనికిలో ఉన్న డ్రోన్లకు ఆమోదం, ఆపరేటర్ పర్మిట్, ఆర్ & డీ ఆర్గనైజేషన్కు ఆమోదం, స్టూడెంట్ రిమోట్ పైలట్ లైసెన్స్, రిమోట్ పైలట్ ఇన్స్ట్రక్టర్ ఆథరైజేషన్, డ్రోన్ పోర్ట్ ఆథరైజేషన్ సరళతరం చేస్తారు.
వీటి నిర్వహణ, తయారీ తదితర కార్యక్రమాలకు అవసరమైన అనుమతులకు సమర్పించాల్సిన పత్రాలను 25 నుంచి ఆరింటికి తగ్గించారు.
డ్రోన్ సైజ్తో సంబంధం లేకుండా నామమాత్రపు ఫీజు వసూళ్లకు అనుమతినిస్తారు.
‘నో పర్మిషన్-నో టేకాఫ్ (ఎన్పీఎన్టీ)’, రియల్ టైం ట్రాకింగ్ బికాన్, జియో ఫెన్సింగ్ తదితర సేఫ్టీ ఫీచర్లు జత చేశారు.
నియంత్రణ సంస్థల ఆమోదానికి 6 నెలలు పడుతుంది.
బిజినెస్ ఫ్రెండ్లీ సింగిల్-విండో ఆన్లైన్ సిస్టమ్గా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తారు. డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో డేటాను నేరుగా పొందేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, దర్యాప్తు సంస్థలు అవకాశం కల్పిస్తాయి.
ఈ ప్లాట్ఫామ్పై సెల్ఫ్ జెనరేటెడ్ పర్మిషన్లు తీసుకోవచ్చు. పరస్పరం సమాచార మార్పిడి కోసం ఈ ప్లాట్ఫామ్లో గ్రీన్, ఎల్లో, రెడ్జోన్ ఎయిర్ స్పేస్ మ్యాప్లు అందుబాటులో ఉంటాయి.
ఈ నిబంధనలు రాష్ట్రాలలో డ్రోన్ల ప్రాజెక్టుల నిర్వహణను అనుమతిస్తాయి. డ్రోన్ల సాయంతో ఔషధాలను రవాణా చేసేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టిందని తెలిపారు.
మారుత్ డ్రోన్ సైతం ఔషధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్నది.
వాణిజ్యేతర మైక్రో డ్రోన్లతోపాటు ఆర్ అండ్ డీ సంస్థలు చేపట్టే డ్రోన్ల ప్రాజెక్టులు, నానో డ్రోన్లకు అనుమతులు అక్కర్లేదు.
విదేశీ సంస్థలకు డ్రోన్ కార్యకలాపాల నిర్వహణకు ఆంక్షలు లేవు.
విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్ (DGFT) ఆధ్వర్యంలో డ్రోన్ల, విడి భాగాల దిగుమతిని నియంత్రిస్తారు. లైసెన్స్/ రిజిస్ట్రేషన్కు సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు.
డ్రోన్స్ 2021 రూల్స్ ఉల్లంఘించిన వారిపై జరిమానాను గరిష్ఠంగా రూ. లక్షకు తగ్గించారు. డ్రోన్ల కవరేజీని 300 కిలోల నుంచి 500 కిలోల వరకు పెంచారు.
ఇది డ్రోన్ ట్యాక్సీలకూ వర్తిస్తుంది. అధీకృత డ్రోన్ స్కూల్లో ఆల్ డ్రోన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ చేపడతారు.
డ్రోన్ స్కూళ్లు, పైలట్ లైసెన్స్, ట్రైనింగ్ రిక్వైర్మెంట్లను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) చేపడుతుంది.
తయారీ దారులు తమ డ్రోన్లకు డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఏకీకృత ధ్రువీకరణ నంబర్ జనరేట్ చేసుకోవచ్చు.
కార్గో డెలివరీల కోసం కారిడార్లు అభివృద్ధి చేస్తారు.