న్యూఢిల్లీ : భారత్లో కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటాలకు దీటైన పోటీ ఇచ్చే ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ లాంఛ్ అయింది. ఈ ఎస్యూవీ రూ 9.78 లక్షల (ఎక్స్షోరూం, ఇండియా)కు అందుబాటులో ఉంటుంది. ఎంజీ భారత్లో ఇప్పటికే హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీలను లాంఛ్ చేయగా ఆస్టర్ అయిదో ఎస్యూవీగా దేశీ మార్కెట్లో ఎంటరైంది. ఇక పెట్రోల్ వెర్షన్లోనే అందుబాటులో ఉండే ఈ ఎస్యూవీ హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిసాన్ కిక్స్, రెనాల్ట్ డస్టర్, స్కోడా కుశక్, వోక్స్వ్యాగన్ టైగన్లకు భారత్ మార్కెట్లో దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
న్యూ ఎంజీ ఆస్టర్ ఐసీఈ పవర్డ్ ఎంజీ జడ్ఎస్ ఈవీకి జోడీగా రూపుదిద్దుకుంది. ఎంజీ ఆస్టర్ 8 ట్రిమ్ లెవెల్స్ స్టైల్, సూపర్, స్మార్ట్ ఎస్టీడీ, స్మార్ట్, షార్ప్, ఫార్ప్ ఎస్టీడీ, శావీ, శావీ రెడ్ ట్రిమ్ లెవెల్స్లో అందుబాటులో ఉంది. అత్యాధునిక ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ ఫీచర్లతో ఎంజీ ఆస్టర్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. 10.1 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ టచ్స్క్రీన్, వైర్లెస్ చార్జింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో న్యూ ఎంజీ ఆస్టర్ కస్టమర్ల ముందుకొచ్చింది. ఇక భారత్లో ఈ ఎస్యూవీ బుకింగ్స్ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుండగా, కస్టమర్లు నేటి నుంచి ప్రీ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.