న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎంజీ మోటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన నూతన ఎస్యూవీ ఆస్టార్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ముందస్తు బుకింగ్లు ఆరంభించిన 20 నిమిషాల్లోనే 5000 ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. డిసెంబర్ వరకు కేవలం 5 వేల యూనిట్లు మాత్రమే డెలివరీ చేయనున్నట్లు ఇదీవరకే ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చేనెల 1 నుంచి ఈ కారు డెలివరీని ప్రారంభించనున్నది. దేశంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత పెంచే ఉద్దేశంలో భాగంగా నూతన మోడల్ ఆస్టార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ.9.78 లక్షల ప్రారంభ ధరతో రూ.16.78 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ..ఈ నూతన మోడల్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించిందని, కేవలం 20 నిమిషాల్లోనే 5 వేల బుకింగ్లు వచ్చాయని చెప్పారు. అంతర్జాతీయంగా చిప్ల కొరతతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, దీంతో సరఫరా వ్యవస్థ సరిగా లేకపోవడంతో తక్కువ సంఖ్యలో కార్లను సరఫరా చేస్తున్నట్లు, వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉన్నదన్నారు. హుందా య్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషక్, ఫోక్స్వ్యాగన్ టైగూన్లకు పోటీగా సంస్థ ఈ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.