న్యూఢిల్లీ : కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మేల్కొని, తమ బాధ్యతలను నిర్వర్తించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. కరోనా పరిస్థితులపై అన్ని రాజకీయ పార్టీలతో సోనియా చర్చించిన అనంతరం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా ఉధృతి తగ్గే వరకు వలస కార్మికుల ప్రయాణాలు ఆపాలని, వారి ఖాతాల్లో ప్రతి నెల రూ. 6 వేలు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలోనే తొలిసారిగా దేశంలో ఒక్కరోజే 4 లక్షల పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టాలన్నారు. మెడికల్ పరికరాలను బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆమె పేర్కొన్నారు.
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే రీతిలో ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరం అండగా నిలవాలని సోనియా సూచించారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులతో పాటు ఇతర సిబ్బందికి తాను పాదాభివందనం చేస్తున్నానని సోనియా గాంధీ తెలిపారు. కరోనా పోరులో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సోనియా స్పష్టం చేశారు.