సెబీ ఆమోదానికి రూ.1,639 కోట్ల ఇష్యూ
హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఫార్మసీ రిటైల్ సంస్థ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్.. స్టాక్ మార్కెట్లలోకి వస్తున్నది. రూ.1,639 కోట్ల పబ్లిక్ ఇష్యూతో సిద్ధమైంది. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం కోసం ఈ ఐపీవోకు సంబంధించిన ప్రాథమిక పత్రాలనూ సంస్థ దాఖలు చేసింది.
ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో ఫ్రెష్ ఇష్యూ ఈక్విటీ షేర్ల విలువ రూ.600 కోట్లుగా ఉంటే, ఆఫర్ ఫర్ సేల్ ఈక్విటీ షేర్ల విలువ రూ.1,038.71 కోట్లుగా ఉన్నది. మెడ్ప్లస్ను 2006లో గంగడి మధుకర్ రెడ్డి స్థాపించారు.
మెడిసిన్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్తోపాటు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులనూ మెడ్ప్లస్ విక్రయిస్తున్నది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి తెలంగాణ, ఏపీ మరో ఐదు రాష్ర్టాల్లో 2వేలకుపైగా మెడ్ప్లస్ స్టోర్లున్నాయి.