కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బు పోతుంది కానీ జబ్బు పోవడం లేదంటున్నారు. దవాఖానల దోపిడితో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు.
కరోనా పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, జీవన ప్రమాణాలు తగ్గిపోకుండా ఉండటానికి, దేశ ఆర్థికస్థితి నిలకడగా ఉండేవిధంగా చేయడానికి ఆర్థిక ఉద్దీపనలను అనేక దేశాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కేంద్రం మొదటి ఉద్దీపన కింద రూ.20 లక్షల కోట్లను కేటాయించింది. రెండో విడతగా రూ.6.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇది మొత్తం దేశ జీడీపీలో 3 శాతమే. ఇందులో నేరుగా ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఆర్థిక స్థిరత్వానికి ఏ మేరకు దోహదపడుతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో ప్రకటించిన ‘స్వయం సమృద్ భారత్’ పేరుతో ఉద్దీపన రూపంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) ఉత్పత్తి రంగంలోని సంస్థలకు 3 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దీనివల్ల 65 లక్షల పరిశ్రమలకు, అందులో పని చేస్తున్న 12 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని ఆశించారు. కానీ ఆశించిందేమీ కండ్లముందు కనిపించలేదు. కారణం.. నేరుగా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందించకుండా బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవాలని ముడిపెట్టడం వల్ల అమలు విధానం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ద్రవ్య లభ్యతను పెంచుతామని చెప్పి ‘అత్యవసర హామీ’ పథకం కింద 1.50 లక్షల కోట్లను ప్రకటించడం సంతోషమే కానీ, బ్యాంకులను దాటడమే అడ్డంకి. ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలు ఇవ్వడం చాలావరకు తగ్గించుకున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మాత్రమే కొంత ముందుకు వస్తున్నా కార్పొరేట్ వాళ్లకే పెద్దపీట వేస్తూ చిన్న పరిశ్రమలను ఆదుకోవడంలో ముందుకురావడం లేదు. ఉద్దీపన తర్వాత బ్యాంకు రుణాలు కేవలం 5.6 శాతం మాత్రమే పెరిగాయి.
కరోనా నేపథ్యంలో పట్టణ నిరుద్యోగులుగా ఉన్నవారు ‘అర్బన్ ఉపాధి హామీ పథకం’ అమలుచేయాలని కోరుతున్నారు. కరోనా కాలంలో అనేక దేశాలు ఈ విధంగానే చేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పట్టణ నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి దాదాపు 1 లక్షా 5 వేలు ఇస్తున్నారు. ఇలా దాదాపు అన్నిదేశాల్లో పట్టణ నిరుద్యోగ భృతి అందుతున్నది. మన దేశంలో కూడా పట్టణ నిరుద్యోగ భృతి ద్వారా నెలవారీ వేతనంగా ఇవ్వాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అమెరికాలో ఉద్దీపన కేటాయింపులు వారి జీడీపీలో 6 శాతంగా 3 లక్షల ట్రిలియన్ డాలర్లు కేటాయించడం గమనార్హం. అందులో స్థానిక సంస్థలకు, రాష్ర్టాలకు 1 లక్ష ట్రిలియన్ డాలర్లను కేటాయించారు. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థలు ప్రజల కోసం ఖర్చుచేసే వెసులుబాటు ఉంటుంది. మన దేశంలో మాత్రం కేంద్రం మొదటి, రెండవ ఉద్దీపనల్లో రాష్ర్టాలకు నిధులు కేటాయించకపోవడం ఆశ్చర్యకరం.
దేశంలో అనేకరంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ముందు వరసలో రైల్వేలు, టూరిజం రంగాలున్నాయి. రైల్వేలు సరకు రవాణాతో కొంతవరకు మెరుగ్గా ఉన్నా, టూరిజం రంగం మొత్తం కుదేలైంది. విదేశీ పర్యాటకుల సంఖ్య 83 శాతం పడిపోయింది. దీన్ని అధిగమించటం కోసం ఉద్దీపనల్లో భాగంగా 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాలు ఇస్తామని, పర్యాటక గైడ్లకు లక్ష చొప్పున రుణాలు అందిస్తామని, ట్రావెల్ టూరిస్ట్ ఏజెన్సీలకు 10 లక్షల వరకు రుణం సమకూర్చుతామని చెప్పారు. దీనికోసం వందకోట్లు కేటాయించారు. అదే ఆస్ట్రేలియాలో చూస్తే, 10 వేల కోట్ల రూపాయలకు సమానమైన నిధులను టూరిజం కోసం కేటాయించటం గమనార్హం. ఉద్దీపనలో మరో పెద్ద కేటాయింపు వైద్యారోగ్య రంగానికి 73 వేల కోట్లు కేటాయించటం ఆహ్వానించదగినది. మూడో దశ కరోనా వ్యాపిస్తుందన్న భయాల నేపథ్యంలో వైద్యం కోసం కేంద్రం 25,220 కోట్లు కేటాయించింది. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు 50 వేల కోట్లు వైద్య, విద్యారంగానికి కనీస వసతులను సమకూర్చుకోవడం కోసం మరికొంత ఖర్చు చేస్తామన్నారు. ఈ యేడు ప్రజల ఆరోగ్య పద్దు కింద గత బడ్జెట్ కంటే 137 శాతం పెంచి 2.23 లక్షల కోట్లను వైద్య, ఆరోగ్య పద్దు కింద చూపించారు. ఈ రెండు మొత్తాలు కలిస్తే ఈ రంగం మీద 2.96 లక్షల కోట్లు ఈ ఏడాది కేంద్రం ఖర్చుపెట్టడం మంచి పరిణామం. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో ఆరోగ్య రంగానికి 10 శాతం ఖర్చుపెట్టడం శుభ పరిణామం. అయినా ఈ కరోనాను గెలవాలంటే ఈ కేటాయింపులు సరిపోవు. 12.63 కోట్ల జనాభా కలిగిన జపాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 56.09 శాతం ప్రజారోగ్యం మీద ఖర్చుచేస్తున్నది. అంటే దాదాపు 20 లక్షలకు కొంచెం అటూఇటుగా ఒక వ్యక్తిపై ఆరోగ్యానికి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకురావడం జపాన్ ప్రజారోగ్యానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో తెలియజేస్తున్నది. 128 కోట్ల జనాభా కలిగిన దేశానికి ఎంత ధనం వెచ్చించినా అది తక్కువగానే ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. చైనా అన్నిదేశాల కంటే ముందున్నది. 118.6 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది. మనదేశం 32.8 కోట్ల డోసులతో లక్ష్యానికి సుదూరంగా ఉన్నది. దేశ జనాభాలో రెండు డోసులు తీసుకున్నవారు 4.1 శాతం మాత్రమే. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకగా నడుస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవటం ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో జరగకపోవటానికి నిధుల లేమి కూడా ప్రధాన అవరోధంగా ఉన్నది. కాబట్టి కేంద్రం వ్యాక్సిన్ తయారీని పెంచుతూ, మరిన్ని ఆర్థిక ఉద్దీపనలతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి. ప్రజలకు నేరుగా ఆర్థికసాయం అందేవిధంగా ఉద్దీపన చర్యలు ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది.
(వ్యాసకర్త: అధ్యాపకులు, కాకతీయ విశ్వవిద్యాలయం)
–డాక్టర్ బైరి నిరంజన్