వంటల్లో, పచ్చళ్ల తయారీలో ఆవాలు, ఆవనూనె వినియోగం పెరుగుతున్నది. దీంతో ఆవాల పంట లాభసాటిగా మారుతున్నది. దీనిపై కొత్త ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం రూపొందించిన ‘డీహెచ్ఎం-11’ రకం ఆవాలు వాణిజ్యసాగులోకి రానున్నాయి. జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ (జీయీఏసీ) నుంచికూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే ఆస్కారం ఉంది. ఈ రకమైన ఆవాలతో నాణ్యమైన నూనెతోపాటు 20-25% దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అనుకూలిస్తే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి జన్యుమార్పిడి ఆహారపంట అవుతుంది.
హరిత విప్లవం వల్ల ధాన్యపుగింజల ఉత్పత్తిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లే, నూనె గింజల్లోనూ అద్భుతాలు సాధించాలని అన్ని రాష్టాలూ భావిస్తున్నాయి. నూనెగింజల ఉత్పత్తిని పెంచే క్రమంలో జన్యుమార్పిడి పంటల శాస్త్రీయతపై ప్రజల్లో అవగాహనకు కృషి జరుగుతున్నది. పత్తిలో బీటీ జన్యువు చొప్పించిన రకాలు ఇప్పటికే రైతుల ఆదరణ పొందాయి. దేశంలో 93% బీటీ పత్తి రకాలే సాగులో ఉన్నాయి. కాకపోతే, పత్తి ఆహారేతర పంట. బీటీ జన్యువు చొప్పించినా మనకు హాని కలుగదు. పత్తితో పోల్చుకుంటే, ప్రస్తుతం జన్యుమార్పిడి ఆవాలు పక్కా సంకర రకం. ఆడ, మగ మొక్కలను సంకర పరిచి, హైబ్రీడ్ రకాన్ని రూపొందించారు. అయితే, సంప్రదాయ పద్ధతిలో కాకుండా బాసిల్లస్ అమైలో విక్విపేషియన్స్ అనే హానికర బాక్టీరియానుంచి సేకరించిన ప్రొటీన్ను జొప్పించడం ద్వారా ఈ రకాలు తయారయ్యాయి. విష ప్రొటీన్వల్ల ఆడరకంలో పుప్పొడి రేణువులు చనిపోయి, కేవలం ఆడపప్పులను ఇస్తుంది. సంకరం తర్వాత ఆడరకంలోని విష ప్రొటీన్ ప్రభావాన్ని మగ రకంలోని ప్రొటీన్ పూర్తిగా అధిగమిస్తుంది. అందువల్ల సంకర రకంలో పూలు సహజంగానే ఉంటూ మంచి దిగుబడినిస్తాయి.
1996లో కెనడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జన్యుమార్పిడి ఆవాలనుంచి ‘కెనోలా’ బ్రాండ్ నూనెను తీసింది. విదేశాలకు ఎగుమతి చేస్తున్నదికూడా. కెనడాలో ఆవాలసాగు విస్తీర్ణం 77 లక్షల హెక్టార్ల వరకూ ఉంది. వీటిలో ైగ్లెపోసెట్, కలుపు మందును తట్టుకొనే రకాలు ఉన్నాయి. ప్రస్తుతం కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలతోపాటు మరో 10 దేశాల జన్యుమార్పిడి ఆవాలను వాణిజ్యపరంగా సాగుచేస్తున్నారు. బెల్జియంలో రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంత మార్చి దీపక్ పెంటెల్ అనే భారతీయ శాస్త్రవేత్త దేశీ ఆవాలలో కృత్రిమ వంధ్యత్వాన్ని చేర్చి సంకర రకాలను సిద్ధం చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి కెనడా, అమెరికాలలో మేధోసంపత్తి హక్కు కూడా ఉంది. దీపక్ పెంటెల్ ప్రకారం, నూతన రకాలలో ఆలివ్
నూనెను మించిన నాణ్యత ఉంటుంది. పెంటెల్ పరిశోధనకు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు నిధులు సమకూర్చింది. ఎన్డీడీబీ వ్యవస్థాపకులు, భారత క్షీర విప్లవ పితామహులు వర్గీస్ కురియన్ ‘ఆపరేషన్ ధార’లో భాగంగా నూనెగింజల ఉత్పత్తిలో దిగుబడుల విప్లవం కోసం.. ఆర్థికంగా ఆ పరిశోధనను ప్రోత్సహించారు. గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన పూర్తిస్థాయి తీర్పు ప్రకారం, నిపుణుల ఆధ్వర్యంలో, విశ్వవిద్యాలయాలలో, భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణలో జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించవచ్చు.
కేంద్రం అనుమతికూడా ఉండటంతో కొన్ని రాష్ర్టాల జన్యుమార్పిడి ఆవాల క్షేత్రస్థాయి పరిశీలనకు అనుమతించాయి. ఆ నివేదిక ఆధారంగానే జీయీఏసీ ఇప్పుడు సాగుకు అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆవాలు దేశంలో నూనెగింజల పంటలలో ప్రధానమైనవి. పురాతనమైనవి కూడా. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విరివిగా పండించే నూనెపంట ఇది. దిగుబడి, ఉత్పాదకత పెరుగుతూనే ఉంది. 1990-91లో హెక్టారుకు 9.04 క్వింటాళ్లున్న ఉత్పాదకత, 2013-14లో 12.62 క్వింటాళ్లకు పెరిగింది. గుజరాత్లో హెక్టారుకు 16.95 క్వింటాళ్ల అత్యధిక సరాసరి ఉత్పాదకత మొదలయ్యింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హర్యానా రాష్ర్టాలలో 70 శాతం పైగా ఆవాల ఉత్పత్తి జరుగుతున్నది.
ప్రపంచంలో ప్రధానంగా సాగవుతున్న జన్యుమార్పిడి పంటలలో మొక్కజొన్న, పత్తి, ఆవాలు ఉన్నాయి. వీటిలో పత్తి ఆహారేతర పంట. జన్యుమార్పిడి మొక్కజొన్నను ప్రధానంగా పశుగ్రాసం పంటగా వాడుతున్నారు. ఆవాలలో బీటీ జన్యువును జొప్పించి పచ్చపురుగు బారినుంచి కాపాడుకునేందుకు జన్యుమార్పిడి చేశారు. జన్యుమార్పిడి ఆవాలను సాగు చేస్తున్న కెనడా, బ్రెజిల్, జపాన్, అమెరికా దేశాలలో ఆహార పదార్థాల లేబిలింగ్ వ్యవస్థ అత్యంత పకడ్బందీగా ఉంది. మార్కెట్లలో జన్యుమార్పిడి ఉత్పత్తులు, జన్యుమార్పిడేతర ఉత్పత్తులకు లేబిలింగ్ (సూచికలు) ఉంటాయి. కాబట్టి, వినియోగదారులకు కొనుగోలులో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అలాగే, మొక్కలలో చిన్న మార్పులను, విషపు ప్రొటీన్లను గుర్తించే ఆధునిక ప్రయోగశాలలు ఉన్నాయి. ఒక్క రోజులో ఆ పదార్థాన్ని పసిగట్టి శాస్త్రీయంగా అంచనా వేయగలిగే సామర్థ్యం అక్కడి నిపుణులకు ఉంది. భారత్లో ఆహార పదార్థాల లేబిలింగ్ వ్యవస్థ బలంగా లేదు. ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థలూ తక్కువే. ఆ వనరులన్నీ సమకూర్చు కోవాలి. అప్పుడే జన్యుమార్పిడి ఆవాలతో అద్భుతాలు సాధిస్తాం.
ప్రపంచంలో అత్యంత వ్యవసాయ వైవిధ్యమున్న దేశం భారత్. ప్రపంచంలో పండే అన్ని పంటలూ భారత్లో ఏదో ఒక మూలన సాగు చేసుకునే వీలుంది. అనుకూల వాతావరణమూ ఉంది. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో అవసరం లేకపోయినా విచ్చలవిడిగా జన్యుమార్పిడికి పూనుకొంటే భారత వ్యవసాయరంగ భవిష్యత్తుకు అది గొడ్డలిపెట్టు అవుతుంది. తగిన జాగ్రత్తలతో జన్యుమార్పిడి ఆవాల సాగుకు అనుమతిస్తే మాత్రం దేశంలోనే మొదటి జన్యుమార్పిడి ఆహారపంట అవుతుంది. ఇప్పటికే జన్యుమార్పిడి పూర్తయి క్షేత్రస్థాయిలో సాగుకు సిద్ధంగా ఉన్న పంటలు.. వరి, గోధుమ, జొన్న.
–మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి