దత్తత గ్రామానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం సాంకేతిక దన్ను
శేరిగూడ భద్రాయిపల్లిలో మట్టి నమూనాల సేకరణ పూర్తి
సాయిల్ హెల్త్కార్డులు అందించి.. ఏ పంట వేయాలో సూచనలిచ్చిన శాస్త్రవేత్తలు
కొత్తూరు, మార్చి 15: భూసారంపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు అవగాహన కల్పిస్తున్నది. అంతేకాకుండా కొత్తూరు మండలంలోని శేరిగూడ భద్రాయిపల్లి గ్రామాన్ని వారు దత్తత తీసుకొని సాగులో రైతులకు మెళకువలను నేర్పిస్తున్నది. యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇక్కడి రైతుల పొలాల్లోని మట్టి నమూనాలను పరీక్షించి సాయిల్ హెల్త్ కార్డులను అందించారు. భూసార ఫలితాల ఆధారంగా ఏ పంట సాగు చేయాలి.. ఎంత మోతాదులో ఎరువులు వాడాలి తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి పంటలోని చీడపీడల నివారణకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తున్నారు.
సాగు విధానంలో అన్నదాతలు మూస పద్ధతిని పాటించడం వల్ల నష్టాలబారిన పడుతున్నారు. నేలను బట్టి పంటను వేసుకుంటే బంగారు పంటలు పండించవచ్చు. భూసారాన్ని బట్టి పంట సాగు చేయకుండా ఎప్పుడు వేసే పంటనే సాగు చేస్తున్నారు. పక్క రైతు సాగు చేసే పంటనే మిగిలిన రైతులు సాగు చేస్తుంటారు. ఏ రసాయన మందులు వాడితే అవే మందులను వాడడం పరిపాటిగా మారింది. దీనివల్ల పెట్టుబడి పెరుగుతుంది కానీ దిగుబడి మాత్రం అంతంతగానే వస్తుండడం బాధాకరం. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సరిగ్గా ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించేలా మూస పద్ధతిలో కాకుండా నూతన సాగు పద్ధతులను తెలుపుతూ అన్నదాతల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నూతన సాగు విధానంతో ఆర్థికంగా ముందుకెళ్లొచ్చని రైతులకు సూచిస్తున్నారు.
దత్తత గ్రామంగా శేరిగూడ భద్రాయిపల్లి..
కొత్తూరు మండలంలోని శేరిగూడ భద్రాయిపల్లి గ్రామాన్ని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దత్తతు తీసుకున్నది. పొలాల్లోని మట్టి నమూనాలను సేకరించి, గ్రామ రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను అందజేసింది. పొలాల్లో ఖనిజ లవణాలను అందులో పొందుపరిచింది. వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికి వచ్చి రైతులకు తగు సూచనలు సలహాలు అందిస్తున్నారు. గ్రామ రైతులను అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్లి ఏ పంట వేయాలి, సస్య రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలన్న వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు, గ్రామ రైతుల వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. సాగు విధానంలో ఎలాంటి సందేహాలున్నా ఫొటో తీసి గ్రూపులో పెడుతున్నారు. దీంతో సంబంధిత శాస్త్రవేత్త ఆ ఫొటోను చూసి తెగులు నివారణకు ఏ మందు వాడాలో సూచిస్తున్నారు. దీంతో రైతు సమస్య తీరిపోతుంది.
ఎస్సీ సబ్ ప్లాక్ కింద రైతులకు సేఫ్టీ కిట్స్..
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 22 మంది ఎస్సీ రైతులకు సేఫ్టీ కిట్స్ను అందించారు. పంటలకు రసాయనాలను స్ప్రే చేసేటప్పడు వాడాల్సిన రక్షణ దుస్తులు (చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్క్, కండ్లజోడు, తలకు తొడుగు, శరీరానికి కవచం) అందించారు. వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పించారు. కొంత మంది రైతులకు ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున కొత్త రకం వరి వంగడాలను పంపిణీ చేశారు.
టెక్నికల్ సఫోర్ట్ అందిస్తున్నాం..
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శేరిగూడ భద్రాయిపల్లి గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నది. గ్రామ రైతులకు టెక్నికల్ సపోర్టు అందిస్తున్నాం. నెలలో రెండు సార్లు గ్రామంలో పర్యటించి తగు సూచనలు సలహాలు ఇస్తున్నాం. సాయిల్ హెల్త్ కార్డులు, రసాయనాల వినియోగం, యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిస్తున్నాం.