న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: మారుతి సుజుకీ.. తన వాహన ధరలను రెండు శాతం వరకు పెంచింది. సెలేరియో మోడల్ తప్పా ఇతర అన్ని మోడళ్ళ ధరలను 1.9 శాతం వరకు పెంచినట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుత సంవత్సరంలో మారుతి ధరలు పెంచడం ఇది మూడోసారి. ఇప్పటికే జనవరి, ఏప్రిల్తోపాటు సెప్టెంబర్ నెలలో కలుపుకొని మొత్తంగా 3.5 శాతం వరకు పెంచినట్లు అయింది. ప్రస్తుతం సంస్థ రూ.2.99 లక్షలు మొదలుకొని రూ.12.39 లక్షల లోపు పలు మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ..కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో వాహన ధరలు పెంచకతప్పలేదని చెప్పారు. గతేడాది కిలో స్టీల్ ధర రూ.38 ఉండగా, ప్రస్తుతం రూ.65కి చేరుకున్నదని, అలాగే రాగి టన్ను ధర 5,200 డాలర్ల నుంచి 10 వేల డాలర్లకు చేరుకున్నదన్నారు.