హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇందుకోసం 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వానకాలం సాగు, విత్తన లభ్యతపై మంగళవారం హాకాభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానకాలంలో పత్తి 70.05 లక్షలు, వరి 41 లక్షలు, కంది 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని రైతులకు సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. విత్తనాలకు కొరత లేదని, అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1.40 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేయగా.. ఇప్పటికే జిల్లాల్లో 59.32 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సోయాబీన్ విత్తనాల కొరత ఉన్నదని.. దీంతో ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. లైసెన్స్లేని డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవద్దని సూచించారు. అదేవిధంగా కొనుగోలు చేసే ప్రతిదానికి రశీదు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నకిలీ విత్తనాల సరఫరాను అడ్డుకొనేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.