హైదరాబాద్, సెప్టెంబర్ 24: మొబైల్ రిటైల్ సంస్థ బిగ్”సి’ మార్కెట్లో మరింత పట్టుసాధించడానికి విస్తరణ బాట పట్టింది. ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 250 స్టోర్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా వచ్చే రెండేండ్ల కాలంలో మరో 250 స్టోర్లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.125 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ ఎండీ బాలు చౌదరి తెలిపారు. కంపెనీ ప్రచారకర్తగా ప్రముఖ హీరో మహేశ్ బాబును నియమించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్టోర్లను చిన్న నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కరోనాతో కుదేలైన మొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు, వచ్చే ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..వచ్చే రెండేండ్ల కాలంలో ఈ సంఖ్య 4 వేలకు చేరుకోనున్నదన్నారు.