ముంబై : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ తరహా చర్యలు చేపట్టడంపై మహారాష్ట్రలో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమలైన లాక్డౌన్తో తమ వ్యాపారాలు కుదేలై ఇంకా కోలుకోకముందే మరోసారి కఠిన నియంత్రణలు విధించడంతో నష్టాల పాలవుతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ప్రతినిధులు బుధవారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ముంబై సహా పలు జిల్లాల్లో లాక్డౌన్ విధించడం పట్ల వ్యాపార వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
వ్యాపారాలను సులువుగా మూసివేయడం, తిరిగి ప్రారంభించడం సులువు కాదని, తమ వద్ద పనిచేసే కార్మికులు ఇంకా గ్రామాల నుంచి తిరిగి పనుల్లోకి రాలేదని సీఎం దృష్టికి తీసుకుచ్చారు. గత లాక్డౌన్ పర్యవసానాల నుంచి పూర్తిగా కోలుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నియంత్రణలు విధించడం సరికాదని అన్నారు.మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పుణే, ఔరంగాబాద్ సహా పలు ప్రాంతాల వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ముంబైలో నిత్యావసరాలను విక్రయించే దుకాణాలు మినహా అన్ని షాపులను మూసివేయాలని నిర్ణయించడం పట్ల ట్రేడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని తామూ కోరుకుంటామని, అందుకు సహకరిస్తామని అయితే ఆర్థిక వ్యవస్ధ కూడా నడవాలని ఔరంగాబాద్ జిల్లా వ్యాపారుల మహాసంఘం అధ్యక్షుడు జగన్నాధ్ కాలే అన్నారు.