హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరోనాతో వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పని విధానంలోనే కాదు.. మన జీవన విధానంలోనూ అనేక మార్పులను తీసుకొచ్చింది. కొవిడ్-19కు ముందు మార్కెట్లో సింగిల్, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఫ్లాట్లకే గిరాకీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ట్రిపుల్ బెడ్ రూంలకు డిమాండ్ కనిపిస్తున్నదని మ్యాజిక్ బ్రిక్స్ ప్రాపర్టీ ఇండెక్స్ తాజా నివేదికలో తేలింది. ఇంటి నుంచి పని కోసం ఓ ప్రత్యేక గదిని ఉద్యోగులు కోరుకుంటున్నారని చెప్పింది. ప్రధానంగా అపార్ట్మెంట్లలో 3 బీహెచ్కే కొనడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని, ఇంకొందరు4 బీహెచ్కే కావాలంటున్నారన్నది. నిజానికి కరోనా మొదటి వేవ్ తర్వాత ఈ ట్రెండ్ మొదలైనా.. రెండో వేవ్ తర్వాత 3, 4 బీహెచ్కేలకు ఆదరణ బాగా పెరిగిందని మ్యాజిక్ బ్రిక్స్ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్లో 3 బీహెచ్కేలకు డిమాండ్ అధికంగా ఉందని పేర్కొన్నది. ఈ జనవరి-మార్చిలో 3 బీహెచ్కేలకు 44 శాతం డిమాండ్ ఉండగా.. ఏప్రిల్-జూన్లో 56 శాతానికి పెరిగింది. కానీ 2 బీహెచ్కేల డిమాండ్ 31 శాతానికి పడిపోయింది.
హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు డిమాండ్ వేగంగా పడిపోతున్నదని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 1 బీహెచ్కేలకు 4 శాతం డిమాండ్ ఉండగా.. ఏప్రిల్-జూన్లో సగానికి తగ్గి 2 శాతానికే పరిమితమైంది. అదే సమయంలో 4 బీహెచ్కే, అంతకన్నా ఎక్కువగా ఉండాలని కోరుకునేవారి సంఖ్య రెట్టింపయ్యింది. 5 శాతం నుంచి 11 శాతానికి ఎగబాకినట్లు మ్యాజిక్ బ్రిక్స్ వెల్లడించింది.