ముంబై, డిసెంబర్ 8: దేశీయ ప్రముఖ ఈవీ కంపోనెంట్ (విద్యుత్తు ఆధారిత వాహనాల విడిభాగాలు) తయారీదారు, హైదరాబాద్కు చెందిన యాక్సియమ్ ఎనర్జీ కన్వర్షన్ను ఇంటిగ్రేటెడ్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ సంస్థ మెజెంటా చేజిక్కించుకున్నది. యాక్సియమ్ ఎనర్జీలో రూ.50 కోట్లతో మెజారిటీ వాటాను మెజెంటా దక్కించుకున్నది. ఎండ్-టు-ఎండ్ ఈవీ సొల్యూషన్స్కు కేరాఫ్ అడ్రస్గా తమ సంస్థను మార్కెట్లో నిలబెట్టాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ పెట్టుబడులకు దిగినట్లు బుధవారం మెజెంటా పేర్కొన్నది. కాగా, ఎంజే పురోహిత్ సారథ్యంలో 25 ఏండ్లుగా నడుస్తున్న యాక్సియమ్ ఎనర్జీ.. ప్రస్తుతం విద్యుత్తు ఆధారిత వాహనాల బ్యాటరీ చార్జర్లు, డీసీ కన్వర్టర్లను తయారు చేస్తున్నది. ‘యాక్సియమ్ ఎనర్జీలో భాగస్వామ్యం.. మా ఈవీ చార్జింగ్ ఎక్విప్మెంట్కు కలిసి వస్తుంది’ అని ఓ ప్రకటనలో మెజెంటా తెలిపింది. యాక్సియమ్ ప్లాంట్లో మెజెంటా ఉత్పత్తుల తయారీకి వీలు కలిగింది. ఈ-రిక్షా సెగ్మెంట్లో దేశంలోనే అతిపెద్ద ఈవీ చార్జర్ బ్రాండ్గా వెలుగొందుతున్న యాక్సియమ్.. ఏటా 6.5 లక్షల చార్జర్లను ఉత్పత్తి చేస్తున్నది.