న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ లు, కఠిన నియంత్రణలు జూన్ వరకూ కొనసాగితే దాదాపు రూ 2.6 లక్షల కోట్ల విలువైన నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్ధ బార్ల్కేస్ అంచనా వేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం, వైరస్ కేసులు, మరణాల సంఖ్యలో అస్పష్టత కారణంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 11 శాతం నుంచి పది శాతానికి కుదించింది.
మహమ్మారి వ్యాప్తి ఇదే తరహాలో కొనసాగి ఆగస్ట్ వరకూ నియంత్రణలు అమలైతే వృద్ధి రేటు 8.8 శాతానికి పడిపోతుందని బార్ల్కేస్ హెచ్చరించింది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలు సంస్ధలు 2021-22 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును సవరిస్తున్నాయి. ఆర్బీఐ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాను 10.5 శాతంగా పేర్కొంది.