న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు చైర్మన్ స్థానంలో సారథ్యం వహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ను నియమించనున్నది. ఇక నుంచి సంస్థలో ఛైర్మన్ పోస్టు ఉండదు. ఎల్ఐసీ ఐపీవోకు రానున్న క్రమంలో కేంద్రం తాజా మార్పును ప్రకటించింది. ఈ మేరకు ఎల్ఐసీ చట్టం 1956లో సవరణలు చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంస్థ అధీకృత మూలధనాన్ని రూ.25,000 కోట్లకు పెంచడానికి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి లభించింది. లిస్టింగ్ సమయంలో రూ.లక్ష కోట్లకుపైగా మార్కెట్ విలువ కలిగిన కంపెనీలు 5 శాతం వాటా మాత్రమే విక్రయించవచ్చన్న నిబంధన సవరణ కూడా ఎల్ఐసీ ఐపీవోను దృష్టిలో ఉంచుకుని చేసిందే.