న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన ఖాతాదారులకు మరో కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. బీమా రక్షణతోపాటు ఖాతాదారుల పొదుపు కోసం ఉపయోగపడేలా దీనికి రూపకల్పన చేసింది ఎల్ఐసీ. ఈ పథకానికి బచత్ ప్లస్ అని పేరు పెట్టింది. సింగిల్ ప్రీమియం లేదా ఐదేండ్ల గడువు గల ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి మొదలవుతుంది. దీనికి గరిష్ఠ పరిమితి లేదు.
ఈ స్కీమ్లో పలు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎల్ఐసీ. సింగిల్ ప్రీమియం ప్లాన్ ఎంచుకున్న పాలసీదారులు మరణిస్తే ఆప్షన్ ఏ ప్రకారం బేసిక్ సమ్ అస్యూర్డ్ మొత్తంపై 10 రెట్లు, ఆప్షన్ బీ కింద ట్యాబులర్ ప్రీమియంపై 1.25 రెట్లు చెల్లిస్తారు.
ఐదేండ్ల తర్వాత పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. పరిహారంతో పాటు, లాయల్టీ అడిషన్ లాంటివి చెల్లిస్తారు. పాలసీని క్లెయిం చేసుకోవాల్సిన అవసరం రాకపోతే.. వ్యవధి తీరాక మెచ్యూరిటీ విలువకు, లాయల్టీ అడిషన్ జోడించి అందిస్తారు. ఈ పాలసీ 180 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ పాలసీ తీసుకున్న కస్టమర్లు ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకునే పాలసీదారులు దానికి ఎల్టీసీ స్కీమ్ బెనిఫిట్లు పొందేందుకు వీలు కలుగుతుంది.
90 రోజుల పసికందుకు సింగిల్ ప్రీమియం.. ఆప్షన్ ఏ, బీ వర్తింపజేస్తే, ఆప్షన్ బీ కింద 44 ఏండ్ల నుంచి 70 ఏండ్లలోపు వారు పాలసీ తీసుకోవచ్చు. ఇక సింగిల్ ప్రీమియం ప్లాన్ పాలసీ దారులు ఆప్షన్ ఏ కింద కనీసం 18 ఏండ్ల వయస్సు, గరిష్టంగా 65 ఏండ్ల వరకు క్లయిమ్ చేసుకోవచ్చు.