ముంబై, ఆగస్టు 31: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 65 ఏండ్లను పూర్తి చేసుకున్నది. బుధవారం 66వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1956 సెప్టెంబర్ 1న కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ఎల్ఐసీని ప్రత్యేక చట్టం ద్వారా స్థాపించారు. అయితే గడిచిన ఈ 65 ఏండ్లలో సంస్థ ఆస్తులు లక్షల రెట్లు పెరుగడం గమనార్హం. కోట్లాది ప్రజల నమ్మకంతో ప్రస్తుతం ఎల్ఐసీ ఆస్తుల విలువ రూ.38,04,610 కోట్లకు చేరింది. ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100’ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం ఎల్ఐసీ.. ప్రపంచంలోని అత్యంత బలమైన బ్రాండ్లలో 3వ స్థానం, విలువైన బ్రాండ్లలో 10వ స్థానంలో ఉన్నది. లక్షకుపైగా ఉద్యోగులు, దాదాపు 14 లక్షల ఏజెంట్లు, 29 కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసీ.. భారత్లోనేగాక మరో 14 దేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే దేశీయంగా 2.10 కోట్ల కొత్త పాలసీలను విక్రయించిన ఎల్ఐసీకి.. భారతీయ బీమా మార్కెట్లో 66 శాతం వాటా ఉన్నది. ఎల్ఐసీకి బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్, పెన్షన్ ఫండ్, అసెట్ మేనేజ్మెంట్, హౌజింగ్ ఫైనాన్స్ రంగాల్లోనూ అనుబంధ సంస్థలున్న విషయం తెలిసిందే.