న్యూఢిల్లీ: ఐపీవో ద్వారా ఎల్ఐసీ పెట్టుబడుల సేకరణకు మరో అడుగు ముందుకు పడింది. ఐపీవో నిర్వహణకు లీగల్ అడ్వైజర్, బుకింగ్ రన్నింగ్ లీడ్ మేనేజర్, రిజిస్ట్రార్, ప్రజల సమస్యలపై అడ్వర్టైజింగ్ సంస్థ కోసం అప్లికేషన్లను కేంద్రం గురువారం ఆహ్వానించింది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఈపీ)ని సీపీపీ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) తెలిపింది.
పైన పేర్కొన్న పోస్టుల కోసం ఈ నెల 15 నుంచి బిడ్లు దాఖలు చేయొచ్చు. వచ్చేనెల ఆరో తేదీ వరకు బిడ్లు వేయొచ్చు. వచ్చేనెల 9న బిడ్లను తెరుస్తారు. ఏ సంస్థ అయినా ఒకటి కంటే ఎక్కువ బిడ్ దాఖలు చేయొద్దని దీపం జారీ చేసిన సర్క్యులర్ తెలిపింది.
ఈ వారంలోనే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల కంటే ఇది పెద్దది. పాలసీ హోల్డర్లకు 10 శాతం షేర్లను ఐపీవోలో రిజర్వు చేశారు.