బెంగళూరు: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలి చెప్పారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మీడియాలో చూపిస్తున్న సీడీ నకిలీదని ఆయన తెలిపారు. తన పేరును చెడగొట్టడం కోసం తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. తనపై సృష్టించిన నకిలీ సీడీ గురించి తనకు నాలుగు నెలల క్రితమే తెలిసిందని ఆయన చెప్పారు. ఆ సీడీని బయటపెట్టడానికి 24 గంటల ముందే తనకు ఆ విషయంలో సమాచారం ఉందన్నారు.
కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ ఫేక్ సీడీని రూపొందించారని రమేశ్ జర్కిహోలి చెప్పారు. ఇంతకుమించిన వివరాలను తాను వెల్లడించలేనని ఆయన పేర్కొన్నారు. అయితే, నకిలీ సీడీ సృష్టించి తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ జైలుకు పంపేవరకు విడిచిపెట్టేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.