న్యూఢిల్లీ, జూన్ 4: కరోనా వైరస్ ఎక్కడ, ఎలా పుట్టింది అన్నదానిపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రతిపాదనను కూడా సిద్ధం చేశారని, దానికి ఆమోదం లభిస్తే.. ‘జనహనన ఆయుధాల చట్టం, 2005’ కింద, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. భారతపై చైనా చేపట్టిన క్రిమి యుద్ధం (బయో వార్ఫేర్) అని అభియోగాలను నమోదు చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే ఈ ప్రతిపాదన ఇంకా తొలిదశలోనే ఉందని, దీనికింకా తుది ఆమోదం లభించలేదని తెలిపాయి. జనహనన ఆయుధాల చట్టం (చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిషేధం), 2005లోని సెక్షన్ 4.. బయోలాజికల్ ఆయుధాలు, బయో వార్ఫేర్ తదితర అంశాలకు సంబంధించినది. అంతర్జాతీయంగా జీవయుద్ధాలు జరుగకుండా కట్టుబడి ఉండటంలో భాగంగా భారత్లో ఈ నిబంధనలను తీసుకొచ్చామని ఈ చట్టం ప్రకటిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ చట్టం ప్రకారం.. కరోనా వైరస్ మూలాలపై, చైనా పాత్రపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రంలోని అత్యున్నతవర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఇటువంటి నేరాలకు సంబంధించిన కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తుంటారు. అయితే, ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నందున దీని గురించి ఎన్ఐఏకు ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదని తెలుస్తున్నది.
ప్రపంచం అంతటా డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా 37 లక్షల మంది మరణానికి కారణమైన కరోనా ఎలా పుట్టిందన్నదానిపై దర్యాప్తు చేయాలని అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ఉంది. అమెరికాతోపాటు పలు యూరప్ దేశాలు దీనికి మద్దతిస్తున్నాయి. చైనాలోని వూహాన్ ల్యాబొరేటరీ నుంచిగానీ,జంతుమాంసాన్ని విక్రయించే మార్కెట్ నుంచిగానీ ఈ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా, వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకొచ్చిందని చెప్పటానికి ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్వో నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఈ దర్యాప్తు సమగ్రంగా జరగలేదన్న వాదనలతో ఆ నివేదికకు విశ్వసనీయత లేకుండా పోయింది.
దర్యాప్తునకు పలు విజ్ఞప్తులు
కరోనా మూలాలపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రప్రభుత్వానికి ఇప్పటికే పలు విజ్ఞప్తులు వచ్చాయి. అరుణాచల్ప్రదేశ్ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ విదేశాంగశాఖకు ఒక లేఖ రాస్తూ.. కరోనావ్యాప్తికి కారణమైన చైనాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని కోరారు. సరిహద్దుల్లో తరచూ ఘర్షణకు దిగుతున్న చైనాకు బుద్ధి చెప్పటానికి ఇది మంచి అవకాశమని దౌత్య నిపుణులూ కేంద్రానికి సూచిస్తున్నారు.