న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇక నుంచి భారత సైనిక బలగాల వేతన ఖాతాలను నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు భారత ఆర్మీతో కొటక్ మహీంద్రా బ్యాంక్ అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది. ప్రస్తుతం పని చేస్తున్న, రిటైర్డ్ సైనికులు, అధికారులకు ప్రత్యేక బెనిఫిట్లు అందజేయనున్నట్లు బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
తమ బ్యాంకు నుంచి సైనికులు, రిటైర్డ్ జవాన్లకు అన్ని రకాల సేవలు అందిస్తామని పేర్కొంది. జీరో బ్యాలెన్స్తో ఖాతా నడిపేందుకు వెసులుబాటు కల్పించనున్నది. ఖాతాలో జమ చేసే మొత్తంపై ఏటా నాలుగు శాతం వరకు వడ్డీ అందచేస్తామన్నది. వీసా ఏటీఎం కార్డుల నుంచి అపరిమితంగా నగదు విత్డ్రాయల్స్కు అనుమతినిస్తుంది. దేశవ్యాప్తంగా తమ బ్యాంకు1604 శాఖలు, 2573 ఏటీఎంల వద్ద వారికి సేవలు లభిస్తాయని పేర్కొంది.