ముంబై, జూలై 16: దేశీయ స్టాక్ మార్కెట్లలో కిటెక్స్ గార్మెంట్స్ షేర్ల హవా నడుస్తున్నది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించిన మరుక్షణం నుంచి షేర్ల విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. కేవలం వారం రోజుల్లో కిటెక్స్ షేర్ విలువ 85 శాతానికిపైగా పుంజుకోవడం గమనార్హం. రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడతామని గత వారం కిటెక్స్ అధినేత సాబూ జాకబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణకున్న జోష్.. కిటెక్స్ షేర్లకూ సంతరించుకున్నది. షేర్ విలువ రూ. 110.05 నుం చి రూ. 204. 05కు ఎగబాకింది. బుధవారం ఒక్కరోజే 10 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ సైతం గడిచిన వారం రోజుల్లో రూ.732 కోట్ల నుంచి ఏకంగా రూ.1,357 కోట్లకు ఎగిసింది. కిటెక్స్లో సాబూ జాకబ్కున్న వాటాల విలువ కూడా రూ.754 కోట్లకు పెరిగింది.