ముంబై: పురాతన పారిశ్రామిక ఫ్యామిలీ కిర్లోస్కర్ కుటుంబంలో తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరిగింది. కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్ విజయ్ కిర్లోస్కర్.. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తలుపు తట్టారు.
2015 నాటి కోర్టు ఆదేశాలకు భిన్నంగా మిగతా నాలుగు కంపెనీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ సెబీకి లేఖ రాశారు. కిర్లోస్కర్ గ్రూప్ పరిధిలోని నాలుగు కంపెనీలకు రూ.23 వేల కోట్ల నిధులు కేటాయించడాన్ని తప్పు బట్టారు. సదరు సంస్థలకు కిర్లోస్కర్ బ్రాండ్ వాడటాన్ని వేలెత్తి చూపారు.
బెంగళూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ్ కిర్లోస్కర్.. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ న్యూమాటిక్, కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ శైలిని ప్రశ్నించారు. ఈ నాలుగు కంపెనీలు సెబీ నిబంధనలను ఉల్లంఘించి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయని విజయ్ కిర్లోస్కర్ ఆరోపించారు.
గత నెల చివరి వారంలో సుప్రీంకోర్టు వరకు కిర్లోస్కర్ గ్రూప్ వివాదం వెళ్లింది. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఆమోదయోగ్యంగా వివాద పరిష్కారానికి సిద్ధ పడితే తాము చేయూతనిస్తామని హితవు చెప్పారు. దేశానికి, పారిశ్రామిక రంగానికి 130 ఏండ్ల చరిత్ర గల కిర్లోస్కర్ గ్రూప్ కుటుంబంలో వివాదాలు మంచిది కాదని సూచించారు.