హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘మరో రెండు రోజుల్లో మీ ప్యాక్ గడువు ముగుస్తుంది. వెంటనే రీచార్జ్ చేయండి’ అని మొబైల్కు అలర్ట్ మెసేజ్లు వస్తుంటాయి. ఇదొక్కటే కాదు బ్యాంకింగ్ యాప్లు, పేమెంట్ వ్యాలెట్లలో గత ఏడాది కాలంలో కొత్త కొత్త ఆప్షన్లు కనిపించడం, సేవల విస్తృతి పెరుగడం వంటివి గమనించే ఉంటాం. ఇవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్తో (ఏఐ) కలుగుతున్న ప్రయోజనాలే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లేదా కృత్రిమ మేధ.. అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న అత్యాధునిక టెక్నాలజీ. ఉత్పత్తిని పెంచడంలో, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో, జీవన ప్రమాణాలను పెంచడంలో కృత్రిమ మేధ (ఏఐ) ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఆర్థిక సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఇప్పటికే ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. డెలాయిట్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 70 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ను ఆశ్రయిస్తున్నాయి. దేశ జీడీపీలో ఏఐ వాటా 2.5 శాతానికి పెరుగుతుందని అసోచామ్ చెప్పగా, ఈ రంగం ఈ ఏడాది 17.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఐడీసీ అంచనా వేసింది.