నకిలీ బంగారు ఆభరణాలతో రూ. కోటి రుణం
పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ మేనేజర్
ఇద్దరు అరెస్ట్.. పరారీలో నలుగురు..
350 గ్రాముల బంగారం స్వాధీనం
సీసీసీ నస్పూర్, జూన్ 24 : నకిలీ బంగారం పేరిట బా్ంయకుకు బురిడీ కొట్టిన కేసులో నిందితులను మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్లో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మ హాజన్ వివరాలు వెల్లడించారు. 2014 నుంచి రంగు అరుణ్కుమార్ నస్పూర్ ఎస్బీఐలో అప్రైసర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి అప్పులు పెరిగాయి. ఇవి తీర్చడానికి అక్రమ సంపాదనపై దృష్టిపెట్టాడు. ఇందుకోసం ఇతడి స్నేహితుడు బ్రహ్మం సలహాలు తీసుకుని నకిలీ బంగారం దందా మొదలు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బందర్లో 9 తులాల రాగికి.. తులం బంగారం కలిపి మొత్తం 10 తులాల బంగారు ఆభరణాలు తయారు చేయించారు. ఆ నకిలీ బంగారు నగలను తను పనిచేస్తున్న నస్పూర్ ఎస్బీఐలో పెట్టి రుణాలు తీసుకున్నాడు. బంగారు ఆభరణలు గురించి బ్యాంకు అధికారులకు అవగాహన లేదని తెలుసుకుని నిత్యం బందర్ నుంచి బంగారు ఆభరణాలు తీసుకువచ్చి రూ.33,72,000 రుణం తీసుకున్నాడు. ఈ దందాలో ఇతని నలుగురు స్నే హితులను కూడా భాగస్వాములను చేశాడు. మొత్తం 2 కిలోల 81 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి బొమ్మ అన్వేష్ రూ.19,90,000, కొంగల లింగారెడ్డి అలియాస్ ఈశ్వర్రెడ్డి రూ.46,99,576, అమ్మ సంతోష్కుమార్ రూ.3,29,000, జీవన్కుమార్ రూ.1,30,000 రుణాలు తీసుకున్నారు. మొత్తం రూ. 1,01,36,551 రుణాలు తీసుకున్నారు.
నకిలీ బం గారం దందా విషయం పోలీసులకు తెలిసింది. దీంతో విచారణ మొదలు పెట్టి బ్యాంకు అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. బ్యాంక్ మేనేజర్ నేహాశర్మ జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడైనా బ్యాంక్ అప్రైసర్ రంగు అరుణ్కుమార్తో పాటు బొమ్మ అన్వేశ్, మంకెన లక్ష్మారెడ్డి, కొంగల లింగారెడ్డి అలియాస్ ఈశ్వర్రెడ్డి, అమ్మ సంతోష్కుమార్, కాడె జీవన్కుమార్పై కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం తోళ్లవాగు సమీపంలో రంగు అరుణ్కుమార్, అమ్మ సంతోష్కుమార్ను పోలీసులు పట్టుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వీరిని పట్టుకుంటామన్నారు. ప్రస్తుతం వీరి వద్ద నుంచి 350 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. మరో ప్రధాన నిందితుడు మంకె లక్ష్మారెడ్డి లావాదేవీలు పూర్తిగా తెలియలేదని, అతను పట్టుబడితే దాదాపు రూ. కోటి వరకు నకిలీ బంగారం దందా బయటికి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. సీఐ కుమారస్వామి, ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు.