జమ్ము: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు. ఈ మధ్యాహ్నం జమ్ములో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలోని చాలా మంది నాయకులకు సంబంధించిన అనేక విషయాలను ఇష్టపడుతానని చెప్పారు. తాను ఓ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి జాతీయస్థాయి నేతగా ఎదగడం తనకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పారు.
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాడేనని, అతను రాజకీయాల్లోకి రాకముందు టీ అమ్మేవాడని గులాంనబీ ఆజాద్ చెప్పారు. ప్రధాని మోదీ, తాను రాజకీయంగా విరోధులమే అయినా.. ఆయన తన చిన్నతనంలో అనుభవించిన పేదరికాన్ని దాచిపెట్టకుండా చెప్పుకోవడాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రధాని స్థాయికి ఎదిగిన తర్వాత కూడా తన పేదరికాన్ని పదేపదే గుర్తుచేసుకునేవారు ఎవరుంటారని ఆజాద్ ప్రశ్నించారు.